గుజరాత్లో దారుణం... ఛాతిపై మోకాలుతో అదిమిపట్టి... కోవిడ్ 19 పేషెంట్పై దాడి...
గుజరాత్లో దారుణం జరిగింది. నర్సింగ్ స్టాఫ్,సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఓ కోవిడ్ 19 పేషెంట్పై దాడికి పాల్పడ్డారు. పేషెంట్ ఛాతిపై మోకాలుతో అదిమిపట్టి మరీ అతన్ని చెంపదెబ్బలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజ్కోట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. వైరల్గా మారిన 55 సెకన్ల నిడివి గల వీడియోలో... ఓ పారామెడిక్,సెక్యూరిటీ సిబ్బంది కోవిడ్ 19 పేషెంట్పై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పీపీఈ కిట్ ధరించిన ఆ పారామెడిక్... 'అలా చేయవద్దని నేను నీతో చెప్పానా..' అంటూ అతన్ని చెంప దెబ్బలు కొట్టింది. పేషెంట్ 'వెయిట్ ప్లీజ్... ప్లీజ్..' అని వేడుకుంటున్నా అతను కనికరించలేదు.
పేషెంట్ను నేలపై పడేసి కొడుతున్నట్లు అందులో స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అతని భుజాలపై కాళ్లతో అదిమిపట్టి కదలకుండా నిలుచున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం... పేషెంట్పై ఎవరూ దాడి చేయలేదని పేర్కొంది. అతనికి హిస్టీరియా ఉందని... కోవిడ్ 19 వార్డులో పరుగులు పెడుతూ గందరగోళం సృష్టించడంవల్ల పారామెడిక్ సిబ్బంది,సెక్యూరిటీ సిబ్బంది కలిసి అతన్ని నియంత్రించే ప్రయత్నం చేశారని తెలిపింది. అప్పటికే అతని చేతికి అమర్చిన ట్యూబ్స్ను కూడా పీకి పడేశాడని చెప్పింది.
అదే ఆస్పత్రికి చెందిన డా.బచ్ మాట్లాడుతూ... కోవిడ్ 19 సోకిన ఆ పేషెంట్ హైపర్ టెన్షన్తో బాధపడుతున్నాడని చెప్పారు. తన బట్టలు తాను చించేసుకుని గందరగోళం సృష్టించాడని అన్నారు. ఎక్కడ ఇతర పేషెంట్లపై కూడా విరుచుకుపడుతాడేమోనన్న భయంతో అతన్ని నియంత్రించే ప్రయత్నం చేశారని తెలిపారు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదని... సైకియాట్రీ నిపుణులతో సంప్రదింపులు జరిపి అతనికి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.