Virat Kohli తమన్నాలకు హైకోర్టు షాక్... సమన్లు జారీ, ఎందుకంటే..?
కొచ్చి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ దాఖలైన పిటిషన్పై విరాట్ కోహ్లీతో పాటు ప్రముఖ నటి తమన్నా, అజు వర్గీస్లకు నోటీసులు పంపింది కేరళ ధర్మాసనం. ఈ ముగ్గురు ఆన్లైన్ రమ్మీ గేమ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే... ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించాలని కోరుతూ త్రిసూర్కు చెందిన పాలీ వర్గీస్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆన్లైన్ రమ్మీ వివిధ ఆన్లైన్ ప్లాట్ఫాంలపై ఉన్నాయి. చాలామంది ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడి ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాంటి ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించాలని కోరుతూ పాలీ వర్గీస్ పిటిషన్ దాఖలు చేశాడు. అంతే కాదు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించాయని పిటిషన్లో గుర్తు చేశాడు పిటిషనర్.
ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రం రమ్మీ ఆడటం నేరంగా పరిగణిస్తూ కేరళ గేమింగ్ చట్టం కూడా 1960లో తీసుకొచ్చింది. చట్టమైతే ప్రభుత్వం చేసింది కానీ అమలు మాత్రం చేయడంలో విఫలమైంది. అయితే ఈ చట్టంలో ఆన్లైన్ రమ్మీని చేర్చలేదు. దీంతో కోర్టు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ పిటిషనర్ పాలీ వర్గీస్ తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించాడు. ఇక ఈ ఆన్లైన్ రమ్మీ పాపులారీటీ పొందేందుకు ముగ్గురు ప్రముఖులు దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు.
Recommended Video
ఇక బ్రాండ్ అంబాసిడర్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా, నటుడు అజు వర్గీస్లు వ్యవహరించారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ వేసిన పిటిషన్ను విచారణ చేసిన కోర్టు అతని వాదనతో ఏకీభవించింది. దీంతో కోర్టు విరాట్ కోహ్లీతో పాటు తమన్నా, అజు వర్గీస్లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కేరళ రాష్ట్ర ప్రభుత్వంను కూడా కోర్టు వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది.