కన్యత్వ పరీక్షలను నేరంగా పరిగణిస్తాం.. హెచ్చరించిన ప్రభుత్వం
ముంబై: వర్జినిటీ టెస్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కొత్తగా పెళ్లైన మహిళకు కన్యత్వ పరీక్షలు చేసిన వార్త వెలుగులోకి రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్యత్వ పరీక్షలు చేశారనే ఫిర్యాదులు అందితే వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. కంజర్బట్ సామాజికి వర్గానికి చెందిన మహిళ వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లగా అక్కడ ఆమెకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ వార్త దావణంలో పాకడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్యత్వ పరీక్షలు రద్దు చేసేలా చట్టం తీసుకురావాలనే ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా మొదలు పెట్టారు.
ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో మహారాష్ట్ర హోంమంత్రి రంజిత్ పాటిల్ ఆ సామాజిక వర్గానికి భరోసా ఇస్తూ ఎవరైనా మహిళలు కన్యత్వ పరీక్షలపై ఫిర్యాదు చేస్తే లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేయాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలిస్తామని తెలిపారు. అంతేకాదు కులాల పంచాయితీలపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిస్తామని చెప్పిన హోంమంత్రి... ఇందుకోసం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కంజర్భట్ సామాజిక వర్గంవారు హోంమంత్రి పాటిల్ను కలిసిన అనంతరం ఈ ఆదేశాలు వచ్చాయి. వీరితో పాటు మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలన్ సమితి వారు కూడా హోంమంత్రి రంజిత్ పాటిల్ను కలిశారు. శివసేన ప్రతినిధి ఎమ్మెల్సీ నీలం గోర్హె కూడా హోంమంత్రితో సమావేశం అయిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో న్యాయశాఖచ హోంశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కన్యత్వ పరీక్షల పై ఫిర్యాదులను డీసీపీ ఆఫీసులో కానీ లేదా మహిళా పోలీస్ స్టేషన్లలో కానీ ఫైల్ చేయొచ్చన్నారు హోంమంత్రి పాటిల్. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సహకారం అధికారులు అందిస్తారని మంత్రి హామీ ఇచ్చినట్లు గోర్హె తెలిపారు.