ఉగ్రదాడుల్లో టెక్నాలజీ వినియోగం: కమ్యూనికేషన్ కోసం వర్చువల్ సిమ్ల వాడకం
పుల్వామా దాడులకు సంబంధించి తొవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి వెనుక ఎంత పెద్ద కుట్ర జరిగిందన్నది స్పష్టమవుతోంది. పుల్వామా దాడుల కోసం టెర్రరిస్టులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. మరింత సమాచారం కోసం భారత్ అమెరికా సాయం కోరింది.
వర్చువల్ సిమ్ల వినియోగం
పుల్వామా దాడుల కోసం టెర్రరిస్టులు పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగానే కారుబాంబు ఎక్స్పర్ట్ ను దొంగచాటుగా దేశంలోకి పంపిన ఉగ్రవాదులు వారి మధ్య కమ్యూనికేషన్ కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. వర్చువల్ సిమ్లను ఉపయోగించిన ఉగ్రవాదులు దాడికి సంబంధించిన వివరాలను ఒకరితో ఒకరు పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వర్చువల్ సిమ్లలోని సమాచారాన్ని చేధించడం భారత్ కు కష్టంగా మారడంతో అధికారులు అమెరికా సాయాన్ని కోరారు.
వర్చువల్ సిమ్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
వర్చువల్ సిమ్ సర్వీస్ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. నిజానికి ఈ సిమ్ మొబైళ్లలో వేసుకునే సిమ్ కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు సిమ్ అనేదే ఉండదు. అమెరికన్ సర్వీస్ ప్రొవైడర్ల కంప్యూటర్లలో ఈ నెంబర్ను జనరేట్ చేస్తారు. దాన్ని వాడుకునేందుకు కస్టమర్లు సదరు సర్వీస్ ప్రొవైడర్ యాప్ని మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. దాన్ని సోషల్ మీడియా అకౌంట్లతో సింక్రనైజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే వెరిఫికేషన్ కోడ్ను యాప్లో ఎంటర్ చేస్తే వర్చువల్ సిమ్ యాక్టివేట్ అవుతుంది. వర్చువల్ సిమ్ కార్డు నెంబర్లు +1తో ప్రారంభమవుతాయి.
భారత్పై మరో ఉగ్రదాడి జరిగిందో..! పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక
అమెరికా సాయం కోరిన భారత్
అమెరికన్లు చాలా వరకు వర్చువల్ సిమ్ లను వాడుతున్నారు. ది మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్ స్క్రైబర్స్ డైరెక్టరీలో వాటి వివరాలు ఉంటాయి. అందుకే భారత్ ఆ వివరాలు ఇవ్వమని కోరుతోంది. అగ్రరాజ్యం సానుకూలంగా స్పందిస్తే వారిచ్చే సమాచారాన్ని విశ్లేషించి ఉగ్రవాదుల ప్రణాళికలను ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.