ఢిల్లీలో దాదాపు ప్రతీ ఇంట్లో కరోనా- ఆంక్షల సడలింపు ఎందుకంటూ కేజ్రివాల్కు హైకోర్టు అక్షింతలు...
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే ద్వారా ఢిల్లీలో నివసిస్తున్న ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. ఈ లెక్కన చూస్తే దాదాపు ప్రతీ ఇంట్లోనూ కరోనా బాధితులున్నట్లు సీరో సర్వే ఆధారంగా హైకోర్టు కూడా నిర్దారించింది.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన నాలుగో దఫా సీరో సర్వే ఫలితాలను కేజ్రివాల్ ప్రభుత్వం హైకోర్టు ముందు ఉంచింది. ఢిల్లీ సెంట్రల్ జిల్లాలో అత్యధిక ప్రజలకు కరోనా వైరస్ సోకినట్లు ఇందులో తేలింది. సెప్టెంబర్లో ఇక్కడ నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో దాదాపు రెట్టింపుకు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఢిల్లీ వ్యాప్తంగా జరిపిన సీరో సర్వేలో 25 శాతం మంచి ప్రజల శరీరాల్లో వైరస్ రోగనిరోధకాలు గుర్తించినట్లు నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
ఢిల్లీలో నిర్వహించిన నాలుగో దఫా సీరో సర్వే నివేదిక పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం పరిస్ధితి చూస్తుంటే కరోనా దాదాపు ప్రతీ ఇంటిని కమ్మేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్ధితుల్లో లాక్డౌన్ ఆంక్షల్ని ఎందుకు సడలిస్తున్నారని కేజ్రివాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇదే తరహాలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతుంటే ఢిల్లీలో మాత్రం ఆంక్షలు సడలిస్తారా అని ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. తాజా పరిస్ధితులను చూస్తుంటే ఢిల్లీలో కరోనా ఇంకా పీక్కు చేరుకోలేదని కోర్టు అభిప్రాయపడింది.