దిగంబర బాబా దెప్పకు ఏఏపీలో ముసలం, రాజకీయాలకు గుడ్బై
న్యూఢిల్లీ: జైన గురువు దింగబర బాబా తరుణ్ సాగర్ మహరాజ్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత విశాల్ దద్లానీ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఆయన రాజకీయాల నుంచి వైదొగలవలసి వచ్చింది. విశాళ్ వ్యాఖ్యలను ఏఏపీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తప్పుబట్టారు.
హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గత శుక్రవారం దిగంబర బాబా సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో దిగంబర్ బాబాపై గాయకుడు, ఏఏపీ నేత విశాల్ దద్లానీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
దీంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యలతో తన జైన్ స్నేహితులు, అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇక నుంచి క్రియాశీల రాజకీయాలకు, కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని విశాల్ ట్వీట్ చేశారు.
అంతకుముందు, శనివారం తరుణ్ సాగర్ బాబాపై విశాల్ ట్విట్టర్లో దిగంబర బాబా ఫొటో పోస్ట్ చేస్తూ 'ఇలాంటి వాళ్లకు ఓటు వేస్తే ఇలాంటి న్యూసెన్స్కు మీరే బాధ్యులవుతారు. మంచి రోజులు రావు. చెడ్డ రోజులే వస్తాయి' అని పేర్కొన్నారు. విశాల్ వ్యాఖ్యలపై జైన మతస్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. విశాల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ కూడా తప్పుబట్టారు. తరుణ్ సాగర్ చాలా మంచి గురువు అని, ఆయన జైనులకే కాదు అందరికీ గురువు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. విశాల్ వ్యాఖ్యల పట్ల ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.