తప్పిన ముప్పు: లక్నోలో విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఇంధనం దాదాపు ఖాళీ
లక్నో : ప్రముఖ ప్రైవేట్ విమానాయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం రోజున ముంబై నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం వాతావరణం సరిగ్గా లేకపోవడంతో లక్నోకు దారి మరల్చారు. ఇక విజిబులిటీ కూడా సరిగ్గా కనిపించక పోవడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఇక విమానంలోని ఇంధనం కూడా ఖాళీ అవుతుండటంతో విషయాన్ని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం చేరవేశారు. ఇక ఉన్న ఇంధనంతో గాల్లో కేవలం 10 నిమిషాల కంటే ఎక్కువగా విమానం ఉండలేదని పైలట్ తెలిపారు. ఇక వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరగా లక్నోలో ల్యాండ్ అయ్యింది. లక్నో ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సరికి విమానంలో 300 కేజీల ఇంధనం మాత్రమే మిగిలి ఉంది. అంటే 10 నిమిషాల కంటే ఎక్కువగా ఈ ఇంధనంతో విమానం ప్రయాణించేది కాదు.
విమానం ముంబై విమానాశ్రయం నుంచి బయలు దేరిన సమయంలో మొత్తం 153 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ బస్ ఏ-320 నియో విమానంలో సరిపడా ఇంధనం ఉండటమే కాదు ఎమర్జెన్సీ సమయాల్లో ఇతర రూట్లలోకి విమానం మళ్లిస్తే గంటపాటు ప్రయాణించేలా అదనంగా ఇంధనం ఉంటుంది. అయితే ఈ విమానంలో మాత్రం అదనపు ఇంధనం లేకపోవడం విశేషం.
ముందుగా లక్నోలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే అక్కడ విజుబిలిటీ సరిగ్గా లేకపోవడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇక ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రయాగ రాజ్ మీదుగా లక్నోలో విమానం ల్యాండ్ చేయాల్సిందిగా ఏటీసీ నుంచి పైలట్లకు సమాచారం అందింది. ఇదిలా ఉంటే వాతావరణం సరిగ్గా లేని కారణంగానే విమానం ఇతర ప్రత్యామ్నాయ ఎయిర్ పోర్టులు అయిన కాన్ పూర్, ప్రయాగరాజ్ లను పరిశీలించామని విస్తారా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే లక్నోలో విజిబులిటీ మెరుగుపడటంతో విమానంను లక్నోలోనే ల్యాండ్ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఇందనం ఖాలీ అయ్యే పరిస్థితికి వచ్చిందని అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని విస్తారా ప్రతినిధి వివరించారు.