ఫోటో తెచ్చిన చేటు: విస్తారా ఎయిర్లైన్స్ను ఎందుకు నిషేధించాలంటున్నారు..?
ఢిల్లీ: దేశీ విమానాయాన సంస్థలకు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో చిక్కుకోగా తాజాగా మరో దేశీ విమానాయాన సంస్థ విస్తారాకు ఇబ్బంది పరిస్థితులు వచ్చాయి. అయితే ఇందుకు కారణం ఆర్థిక కష్టాలు కాదు... ఒక ప్రముఖ వ్యక్తి ఆ విమానంలో ప్రయాణించడమే.
రిటైర్డ్ మేజర్ జనరల్తో సిబ్బంది ఫోటో
విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా తయారైంది దేశీ విమానాయాన సంస్థ ఎయిర్ విస్తారా పరిస్థితి. గత 24 గంటల్లో సోషల్ మీడియాలో బాయ్కాట్ విస్తారా అనేది ట్రెండ్ అవుతోంది. ఇది ఎందుకు ఇలా ట్రెండ్ అవుతోందో అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. కార్గిల్ యుద్ధ సమయంలో శతృదేశం పై పోరాడిన మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ ఎయిర్ విస్తారా విమానంలో ప్రయాణించారు. అయితే ఆయన ప్రయాణించిన ఫోటో తీసుకున్న సిబ్బంది ఆ ఫోటోను తమ అధికారిక వెబ్సైట్లో పోస్టు చేసింది. కార్గిల్ వార్ హీరో జీడీ భక్షీ తమ విమానంలో ప్రయాణించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం, దేశానికి చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విటర్లో పోస్టు పెట్టింది.
మేజర్ జనరల్ గత చరిత్ర చెప్పుకొచ్చిన నెటిజెన్లు
ట్వీట్ చేసిన కొద్ది గంట్లోనే నెటిజెన్లు తమదైన శైలిలో రిప్లై ఇచ్చారు. గతంలో జీడీ భక్షీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పోస్టు చేశారు. ఇలా చాలా రావడంతో విస్తారా యాజమాన్యం తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసిన ఫోటోను తొలగించింది. అంతేకాదు దీనిపై వివరణ ఇస్తూ మరో లేఖను పోస్టు చేసింది. తమ విమానాల్లో ప్రయాణించే కస్టమర్ల ఫోటోలను విస్తారా పోస్టు చేస్తుందని.. అయితే భక్షీ ఫోటో పోస్టు చేయగానే వివాదాస్పదమైందని వెల్లడించింది. తమ ట్విటర్ హ్యాండిల్ వల్ల ఎవరి మనసుకు కష్టం కలగకూడదనే ఫోటోను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఫోటోను డిలీట్ చేసి త్రివిధ దళాలను అవమానిస్తారా..?
ట్విటర్ నుంచి ఆ ఫోటోను తొలగిస్తున్నట్లు విస్తారా యాజమాన్యం తెలపడంతో ఇది మరింత అగ్గిని రాజేసింది. మరో వర్గానికి చెందిన నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒత్తిడికి గురిచేస్తే వారి మాటలు నమ్మి దేశానికి సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తిని అవమానిస్తారా అంటూ కొందరు ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన విస్తారా ఎయిర్లైన్స్ను నిషేధిస్తున్నట్లు నెటిజెన్లు ట్వీట్ చేశారు. వెంటనే తిరిగి ఫోటోను పోస్టు చేయాల్సిందిగా నెటిజెన్లు డిమాండ్ చేశారు. లేదంటే అది త్రివిధ దళాలను అవమానించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఇక కొందరైతే తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ట్విటర్లోనే కాదు ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తారాను నిషేధించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.