న్యాస్ ట్రస్ట్ లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లకు చోటు: 65 శాతం రెడీ..: విశ్వహిందూ పరిషత్..!
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించబోయే రామమందిరం కార్యకలాపాలను పర్యవేక్షించడానికి త్వరలో ఏర్పాటు కాబోయే న్యాస్ ట్రస్ట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లకు చోటు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ సూచించింది. రామమందిరం ఆలయ కమిటీలో వారిద్దరికీ చోటు కల్పించడం వల్ల నిర్మాణ.పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని వీహెచ్ పీ శరద్ శర్మ అభిప్రాయపడ్డారు. రామమందిరం నిర్మాణం కోసం కృషి చేసిన వారిని సైతం ట్రస్ట్ లోకి తీసుకోవాలని అన్నారు.
బీజేపీ అక్రమంగా గద్దెనెక్కింది..కర్ణాటక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి: కాంగ్రెస్
బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 30 సంవత్సరాలుగా రామమందిర నిర్మాణం కోసం కలలు గన్న వారు చాలామంది ఉన్నారని, వారందరి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలనే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలను మార్చుకునైనా సరే.. న్యాస్ ట్రస్ట్ లో అమిత్ షా, యోగిలకు స్థానం కల్పించాలని ఆయన కోరారు. రామమందిరం నిర్మాణానికి అవసరమైన రాతి శిల్పాలు, కట్టడాల పనులు 65 శాతం మేర పూర్తయ్యాయని అన్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవమి పండుగ నాడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, ఈ లోగా సర్వం సిద్ధం చేస్తామని చెప్పారు.
ఆలయ నిర్మాం కోసం విశ్వహిందూ పరిషత్ 30 సంవత్సరాలుగా అయోధ్యలో శిల్పశాలను నిర్వహిస్తోంది. రాతి శిల్పాలు సహా కట్టడానికి ఉపయోగించే అనేక వస్తువులు అక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడటానికి రెండు రోజుల ముందు రాతి శిల్పాలను చెక్కే పనులను నిలిపి వేసింది విశ్వహిందూ పరిషత్. త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని తాజాగా శరద్ శర్మ వెల్లడించారు. తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా వచ్చినందువల్ల పనులను మరింత వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికోసం మరింత మంది శిల్ప కళాకారులను నియమించుకుంటామని చెప్పారు.