శశికళ మేనల్లుడి ఆస్తులు చూసి ఐటీ శాఖ దిమ్మతిరిగింది: కేసు ఈడీకి, ఆస్తులు జప్తు చేస్తే ఎలా!
చెన్నై: శశికళ ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరిన చిన్నమ్మ శశికళ మేనల్లుడి అక్రమాస్తులు చూసి ఐటీ అధికారుల దిమ్మ తిరిగింది. శశికళ కుటుంబ సభ్యుల అరెస్టుకు మరో సారి రంగం సిద్దం అయ్యిందని శనివారం సాయంత్రం వెలుగు చూసింది.
శశికళ అక్రమాస్తులకు ఆమె మేనల్లుడు, ఇళవరిసి కుమారుడు వివేక్ బినామీగా ఉన్నాడని చాల కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. జాజ్ సినిమా సీఇవోగా ఉన్న వివేక్ అనేక ఇంగ్లీష్, హిందీ, తమిళ సినిమాలను పంపిణి చేశాడు. జయలలిత మరణించిన తరువాత వివేక్ జయ టీవీ ఎండీ అయ్యాడు.
గత మూడు రోజుల నుంచి శశికళ ఫ్యామీలీ మీద ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి. శశికళ మేనల్లుడు వివేక్ ఇంటిలో గత మూడు రోజుల నుంచి సోదాలు చేస్తున్నారు. వివేక్ సోదరి, శశికళ మేనకోడలు కృష్ణప్రియ ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి.
శశికళ మేనల్లుడు వివేక్, కృష్ణప్రియ ఇంటిలో రూ. వందల కోట్ల విలువైన అక్రమాస్తుల పత్రాలు బయటపడ్డాయని శనివారం సాయంత్రం తమిళ మీడియా ప్రచారం చేసింది. వివేక్ అక్రమాస్తుల గుర్తించిన ఐటీ శాఖ అధికారులకు దిమ్మ తిరిగిపోయిందని, అతని కేసు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారని తెలిసింది. వివేక్ కేసు ఈడీకి అప్పగిస్తే అతని ఆధీనంలో ఉన్న ఆస్తులు జప్తు చేసి అరెస్టు చేసే అవకాశం ఉండటంతో మన్నార్ గుడి మాఫియా ముఠా సభ్యులు హడలిపోతున్నారు.