షాక్: వీకే శశికళ విడుదలకు ప్రయత్నాలు ? జైల్లో సత్ర్పవర్తన అంటూ లేఖ, చిన్నమ్మకు చాన్స్!
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు వికే. శశికళ అలియాస్ చిన్నమ్మ గురించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ సత్ర్పవర్తనతో నడుచుకుంటున్నారంటూ ఆమెను విడుదల చెయ్యడానికి రంగం సిద్దం అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమే అని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.
అక్రమాస్తుల కేసు
ఆదాయానికి మించిన అక్రమస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలతిత, ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళతో సహ నలుగురికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విదిస్తూ గతంలో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బెంగళూరు కోర్టును సవాలు చేస్తూ వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కింది కోర్టు విదించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం ఖరారు చెయ్యడంతో అక్కడా వీరికి ఎదురుదెబ్బ తగిలింది.
బెంగళూరు జైల్లో శిక్ష
జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె ప్రాణ స్నేహితురాలు వీకే. శిశికళ, ఇళవరసి, జయలలిత మాజీ పెంపుడు కుమారుడు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీకే. శశికళతో సహ ముగ్గురికి న్యాయస్థానం నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, అపరాద రుసుం విదించింది.
అమ్మకు రూ. 100 కోట్లు, శశికళకు రూ. 10 కోట్లు ఫైన్
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితకు రూ. 100 కోట్లు, శశికళకు రూ. 10 కోట్లు అపరాద రుసుం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జయలలిత మరణించినందున ఆమె ఆస్తులు విక్రయించి అపరాద రుసుం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు సూచించింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ అపరాద రుసుం చెల్లించకుంటే మరో 13 నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు శశికళ కోర్టుకు రూ. 10 కోట్ల అపరాద రుసుం చెల్లించలేదు.
జైల్లో రాచమార్యాదలు !
బెంగళూరు సెంట్రల్ జైల్లో వీకే. శశికళకు రాచమర్యాదలు జరుగుతున్నాయని, ఆమె జైలు నుంచి బయటకు వెళ్లి వస్తున్నారని గతంలో కర్ణాటక ఐపీఎస్ అధికారిని రూపా ఆరోపణలు చెయ్యడంతో జైళ్ల శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. అప్పట్లో శశికళ విషయం పెద్ద రాద్దాతం కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళకు ప్రత్యేక గదులు కేటాయించారని ఆరోపణలు రావడంతో అప్పటి ప్రభుత్వం వాటిని ఖండించింది. శశికళ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నది.
శశికళ విడుదలకు ప్లాన్ ?
బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. జైల్లో శశికళ సత్ర్పవర్తనతో ఉన్నారని, ఆమెను విడుదల చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల జైళ్ల శాఖ అధికారులు వారి పై అధికారులకు శిఫారస్సు చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే మహిళా ఐపీఎస్ అధికారి రూపా చేసిన ఆరోపణలు, వినయ్ కుమార్ కమిటి నివేదిక వ్యవహారం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.
చాన్స్ లేదు !
బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళకు నాలుగు సంవ్సరాలు జైలు శిక్ష పూర్తి అయిన తరువాత ఆమెను విడుదల చెస్తామని, ముందుగా విడుదల చెయ్యడం సాధ్యం కాదని కర్ణాటక ప్రభుత్వ అధికారులు అంటున్నారు. శశికళ ఇంత వరకూ రూ. 10 కోట్ల అపరాద రుసుం కోర్టులో చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో శశికళను విడుదల చెయ్యడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. అయితే సత్ర్పవర్తన కారణాలతో శశికళను ముందుగానే జైలు నుంచి విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.