శశికళపై సంచలనం: 'అక్కడ డబ్బు దాచారు, జయలలితను మోసగించి పంచారు'
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలులో ఉన్న శశికళను వరుస ఘటనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలులో ఉన్న శశికళను వరుస ఘటనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమెను ఐటీ అధికారులు విచారించనున్నారు. డొల్ల కంపెనీలు, వాటిలో పెట్టిన పెట్టుబడుల నిగ్గుతేల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
శశికళపై దీపక్ సంచలనం
ఈ కేసును ఈడీకి కూడా బదిలీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతకాలం శశికళ, టీటీవీ దినకరన్ల వైపు ఉన్న జయలలిత అన్న కుమారుడు, దీప సోదరుడు దీపక్ బుధవారం బాంబు పేల్చారు.
యూకే, దుబాయ్లలో డబ్బు దాచారు
శశికళ డబ్బును పెద్ద మొత్తంలో యూకే, దుబాయ్లో దాచి పెట్టారని దీపక్ అన్నారు. వైకుందరాజన్, మైనింగ్ గుత్తేదారుడు శేఖర్ రెడ్డి, ఇసుక వ్యాపారి ఆర్ముగస్వామి, ఎస్ఆర్ఎంసీకి చెందిన వెంకటాచలం తదితరుల వద్ద కూడా ఆమె పెద్దమొత్తంలో నగదు దాచిపెట్టారన్నారు.
జయలలితను మోసగించి, డబ్బు పంచి పెట్టారు
జయలలితను శశికళ మోసగించి పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొట్టి కుటుంబానికి పంచి పెట్టారని దీపక్ ఆరోపించారు. ఐటీ అధికారులు సంప్రదిస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
లోతుగా దర్యాఫ్తు చేయాలని దీపా జయకుమార్
జయలలిత మరణంపై ఏర్పాటైన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ముందు హాజరైన దీపక్ సోదరి దీపా జయకుమార్ కూడా జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మరణించేవరకు అనేక అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు.