శశికళ కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడి: ఆరు వాహనాలు ధ్వంసం
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ నటరాజన్ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శశికళ కాన్వాయ్ పరప్పన అగ్రహార జైలులోని కోర్టులో లొంగిపోతున్నారని తెలుసుకున్న ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదే సమయంలో ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న తమిళ ప్రజలు పెద్ద సంఖ్యలో జైలు దగ్గరకు చేరుకున్నారు.
ఆ సందర్బంలో శశికళ కాన్వాయ్ మీద రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా శశికళ కారుతో సహ మూడు వాహనాలను జైలు ఆవరణంలోకి పంపించారు. అయితే కాన్వాయ్ వెనుక ఉన్న వాహనాలను లొపలికి అనుమతి ఇవ్వలేదు.
ఆ సమయంలో శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు ఆమె అనుచరులు వచ్చిన వాహనాలపై దాడులు చేశారు. రాళ్లు, కర్రలు, చెప్పులతో దాడులు చేశారు. శశికళ మద్దతుదారుల వాహనాలు ధ్వంసం చేశారు. అదే సమయంలో వాహనాలను అక్కడి తీసుకెళ్లాలని హెచ్చరించారు.
బైక్ ల్లో హెల్మెట్లు పెట్టుకుని వచ్చిన యువకులు ఆరు వాహనాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కార్యకర్తల దాడిలో తమిళనాడు రిజిస్ట్రేషన్ అయిన ఐదు స్కార్పియో కార్లు, ఒక ఇన్నోవా కారు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను పరిశీలించి ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.