భర్త నటరాజన్ ను పరామర్శించిన శశికళ, బంధువులతో బిజీబిజీ, ఇంటలిజెన్స్ నిఘా !
అన్నాడీఎంకే పార్టీలో, తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ప్రయత్నించి చివరికి జైలుపాలైన శశికళ చెన్నైలోని గ్లోబల్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ ను పరామర్శించారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో, తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ప్రయత్నించి చివరికి జైలుపాలైన శశికళ చెన్నైలోని గ్లోబల్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ ను పరామర్శించారు. శనివారం ఉదయం శశికళ గ్లోబల్ సిటీ ఆసుపత్రికి చేరుకున్నారు.
శనివారం ఉదయం చెన్నైలోని టీ నగర్ లోని ఇళవరసి (శశికళ వదిన) కుమార్తె క్రిష్ణ ప్రియ ఇంటిలో చిన్నమ్మ శశికళను టీటీవీ దినకరన్ తో పాటు ఆమె బంధువులు కలిశారు. ఉదయం 11 గంటల వరకు బంధువులతో తీరికలేకుండా మాట్లాడిన శశికళ తరువాత గ్లోబల్ సిటీ ఆసుపత్రి దగ్గరకు బయలుదేరారు.
గ్లోబల్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజ్ ను పరామర్శించిన శశికళ అక్కడే ఉన్నారు. శశికళలతో పాటు టీటీవీ దినకరన్, మన్నార్ గుడి సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. శశికళను రాజకీయ నాయకులు ఎవరైనా కలుస్తారా అంటూ ఇంటలిజెన్స్ అధికారులతో పాటు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు.
రాజకీయ చర్చలు, ప్రసంగాలు చెయ్యకూడదని ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు శశికళకు సూచించారు. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం శశికళ మీద నిఘా వెయ్యాలని ఇంటలిజెన్స్ అధికారులకు సూచించిందని తెలిసింది.