దెబ్బకు దెయ్యం దిగింది: తలపట్టుకున్న పళనిసామి: చెత్తకుప్పలో ఫోటోలు!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తలపట్టుకుంటున్నారు. ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గెయ్యి అన్నట్లు తయారైయ్యింది. ఇప్పటికే అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇప్పుడు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చీలిక వర్గం పన్నీర్ సెల్వం టీం, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలి అంటూ ఆందోళన చెందుతున్నారు. మరో పక్క శశికళ, ఆమె కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో నెటిజన్లు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.
24 గంటల్లోనే అంతా
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లో శశికళ ఫోటోలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని మంగళవారం సాయంత్రం పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు, జయలలితకు అత్యంత సన్నిహితుడు అయిన మధుసూదనన్ డిమాండ్ చేసిన విషయం తెలిసింది.
బెట్టు చేసిన సీనియర్ మంత్రి
ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి శ్రీనివాసన్ శశికళ ఫోటోలు తొలగించే విషయంలో మొదట స్పందించారు. శశికళ ఫోటోలు ఎందుకు తొలగించాలి ? మీరు చెప్పినట్లు ఎందుకు చెయ్యాలి ? అంటూ బెట్టు చెయ్యడంతో పన్నీర్ సెల్వం వర్గం రగిలిపోయింది.
ఢిల్లీ దెబ్బతో ఉలిక్కిపడ్డారు
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్ల లంచం ఎర వేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగు రోజుల విచారణ అనంతరం మంగళవారం అర్దరాత్రి టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దినకరన్ అరెస్టుతో శశికళ వర్గంలోని నాయకులకు సినిమా కనపడింది.
చెత్తకుప్పల్లో శశికళ బ్యానర్లు
బుధవారం ఉదయం అయ్యిందో లేదో, చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన నాయకులు అక్కడ ఏర్పాటు చేసిన శశికళ నటరాజన్ బ్యానర్లు, ఫెక్సీలు తొలగించి చెత్తకుప్పల్లో వేశారు. పనిలో పనిగా టీటీవీ దినకరన్ బ్యానర్లు చించేశారు.
ఎమ్మెల్యే కావాలనుకున్న చోట
టీటీవీ దినకరన్ ఎమ్మెల్యే కావాలనుకుని ఆశపడి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ నియోజక వర్గంలో ఆయన మద్దతుదారుడు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీటీవీ దినకరన్ అరెస్టు అయ్యాడని తెలుసుకున్న స్థానికులు బ్యానర్లు, ఫ్లెక్సీలు చించేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఏం చేస్తారు
శశికళ ఇప్పటికే జైల్లో ఉన్నారు. టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శశికళ అండతో ముఖ్యమంత్రి అయిన ఎడప్పాడి పళనిసామి, ఆయన మంత్రి వర్గం ఇప్పుడు ఏం చెయ్యాలి ? అంటూ సతమతం అవుతున్నారు.
సోషల్ మీడియాలో రచ్చరచ్చ
టీటీవీ దినకరన్ అరెస్టు అయిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించడంతో ఆ పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అంటూ జోకులు వేస్తున్నారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని ప్రజల సమస్యల తీర్చడానికి ప్రయత్నించాలని అన్నాడీఎంకే పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.