జయలలిత నియోజక వర్గం: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకు సిద్దం, అన్నాడీఎంకేకి పెద్ద సవాలు !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని వివిధ పార్టీల రాజకీయ నాయకులు అంటున్నారు.
గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ డిసెంబర్ 31వ తేదీ లోపు చెన్నైలోని ఆర్ కే నగర్ లో ఉప ఎన్నికలు పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా డీఎంకే పార్టీ విజయం సాధిస్తుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎండీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి పోటీ చెయ్యరని చెప్పారు.
తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే పార్టీ అమ్మ ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను ఒక చాలెంజ్ గా తీసుకుని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నది. శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ ను కాకుండా మరో వ్యక్తిని పోటీకి దించాలని చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఉప ఎన్నికలు త్వరలోనే వస్తాయని తెలుసుకున్న శశికళ గ్యాంగ్ చాల హ్యాపీగా ఉందని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది.