బెంగళూరు సెంట్రల్ జైల్లో టీవీకి అతుక్కుపోయిన శశికళ, కంటి మీద కునుకులేండా చేశారు !
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే. శశికళ నటరాజన్ బెంగళూరు సెంట్రల్ జైల్లో టీవీకి అతుక్కుపోయారని తెలిసింది. ప్రతి రోజూ తమిళ దినపత్రికలు చదువుతూ మా కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఏం జరుగుతందో అంటూ ఆందోళన చెందుతున్నారని సమాచారం.
తమిళనాడులో ఏంజరుగుతోంది, మా కుటుంబ సభ్యుల ఆస్తులు ఏమైనా స్వాధీనం చేసుకోవడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు వస్తున్నారా ? అంటూ ప్రతినిమిషం ఎప్పటికప్పుడు టీవీలో వార్తలు చూస్తూ శశికళ సమాచారం తెలుసుకుంటున్నారని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వర్గాలు అంటున్నాయి.
గత ఐదు రోజుల నుంచి సరిగా నిద్ర, ఆహారం లేక శశికళ నీరసంగా ఉన్నారని జైల్లోని ఓ మహిళ గార్డు అంటున్నారు. శశికళతో పాటు ఆమె వదిన ఇళవరసి సైతం ఆందోళనతో ఉన్నారని, కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియకు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఆవేదన చెందుతున్నారని తెలిసింది.
శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మా కష్టాలు తీర్చాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. ఐటీ శాఖ అధికారులు శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.