బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ వ్రతం, అమ్మకోసం అంటున్న టీటీవీ దినకరన్ !
బెంగళూరు: జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శశికళతో భేటీ అయ్యారు. అనంతరం జైల్లో శశికళ ఏం చేస్తున్నారో అనే విషయాలను టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించిన విషయం తెలిసిందే. జయలలిత మరణించిన రోజు డిసెంబర్ 5 (2017) నుంచి నేటి వరకూ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ మౌనవ్రతం చేస్తున్నారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు.
2018 జనవరి చివరి వరకూ బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ మౌనవ్రతం చేస్తారని టీటీవీ దినకరన్ అన్నారు.జయలలిత అనారోగ్యంతోనే మరణించారని, ఎవ్వరూ ఆమెకు ఎలాంటి హాని చెయ్యలేదని, కొందరు కావాలనే మా కుటుంబం మీద బురద చల్లుతున్నారని టీటీవీ దినకరన్ ఆరోపించారు.
ఆర్ కే నగర్ లో తాను విజయం సాధించడానికి పై నుంచి అమ్మ జయలలిత, జైల్లో నుంచి చిన్నమ్మ శశికళ తనను ఆశీర్వదించారని టీటీవీ దినకరన్ చెప్పారు. తనను నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించిన ఆర్ కే నగర్ ప్రజలకు ఎలాంటి కష్టంరాకుండా, వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకుంటానని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.