ఆస్తులు, పార్టీ గొడవలు, శశికళకు ఒత్తిడి, పెరోల్ గడువు పూర్తి కాకుండానే బెంగళూరు జైలుకు!
చెన్నై: భర్త నటరాజ్ అనారోగ్యంతో మరణించడంతో పెరోల్ మీద బయటకు వచ్చిన వీకే శశికళ కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు బయలుదేరారు. ఇక్కడే ఉంటే ఆస్తులు, కేసులు, కొత్త పార్టీ విషయంలో గొడవలతో కుటుంబ సభ్యులు తనను సతమతం చేస్తారని ఆందోళన చెందిన శశికళ పెరోల్ గడువు పూర్తికాకుండానే బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లిపోవాలని నిర్ణయించారు.
Recommended Video
ఏప్రిల్ 3వ తేది
నటరాజన్ అంత్యక్రియలు, ఆయన కర్మకాండ కార్యక్రమాలు పూర్తి చెయ్యడానికి శశికళకు కోర్టు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. మార్చి 20వ తేదీన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు శశికళ పెరోల్ మీద బయటఉండటానికి అవకాశం ఉంది.
పార్టీ నాయకులు
తంజావూరులో భర్త నటరాజన్ ఇంటిలో ఉన్న శశికళను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్, ఆ పార్టీ నాయకులు, అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించారు.
వెనక్కి వెళ్లిపోయిన జయా టీవీ సీఇవో
తంజావూరులోని శశికళ ఇంటికి జయా టీవీ, జాజ్ సినిమాస్ సీఇవో వివేక్ వెళ్లారు. అయితే ఆ సమయంలో శశికళ పక్కనే టీటీవీ దినకరన్ ఉన్న విషయం గుర్తించిన వివేక్ ఆమెను పలకరించకుండానే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోవడంతో చిన్నమ్మ వర్గీయులు షాక్ కు గురైనారు.
సొంత తమ్ముడు
శశికళ సోదరుడు దివాకరన్, ఆయన కుటుంబ సభ్యులు శశికళను పరామర్శించారు. అయితే అక్కడ టీటీవీ దినకరన్ శశికళను వదిలిపెట్టకుండా పక్కనే నిలబడి ఉండటంతో దివాకరన్ కుటుంబ సభ్యులు సైతం ఆమెతో ఎక్కువ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆస్తుల గొడవ
ఆస్తుల విషయాలు, కొత్త పార్టీ విషయంలో శశికళ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇలాంటి సమయంలో ఇంకా ఇక్కడే ఉంటే లేనిపోని సమస్యలు ఎదురౌతాయని భావించిన శశికళ పెరోల్ గడువు పూర్తి కాకముందే బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లిపోవాలని నిర్ణయించారని ఆమె సన్నిహితులు అంటున్నారు.