జైలు నుంచి పెరోల్ మీద బయటకు: అనారోగ్యానికి గురైన వీకే శశికళ, బంధువుల ఆందోళన!
చెన్నై: అనారోగ్యంతో భర్త నటరాజన్ మరణించడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి 15 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చిన వీకే. శశికళ నటరాజన్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురైనారు.
కుప్పకూలిన శశికళ
తంజావూరులోని ఇంటిలో ఉంటున్న వీకే. శశికళ నటరాజన్ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తెలిసింది. విషయం తెలుసుకున్న శశికళ నటరాజన్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి చేరుకుని ఆమెకు చికిత్స చేశారని చిన్నమ్మ కుటుంబ సభ్యులు అంటున్నారు.
షుగర్ వ్యాదితో సమస్య!
శశికళ చాలకాలం నుంచి షుగర్ వ్యాదితో బాధపడుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆమె చికిత్స పొందుతున్నారు. షుగర్ వ్యాది కారణంగా శశికళ నీరసంగా ఉండి కుప్పకూలారా, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం ఆమె కుటుంబ సభ్యులు బయటకు చెప్పడం లేదు.
కుటుంబ సభ్యుల ఆందోళన
శశికళ అనారోగ్యానికి గురైనారని విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు దివాకరన్, వారి కుటుంబ సభ్యులు తంజావూరులోని శశికళ ఇంటికి చేరుకుని ఆమెను పరామర్శించారు. భర్త చనిపోయాడని ఆవేదనలో శశికళ అనారోగ్యానికి గురైనారని తెలిసింది.
నియమాలతో దినకరన్ దూరం
జైళ్ల శాఖ అధికారుల నియమాల ప్రకారం శశికళ తంజావూరు విడిచి బయటకు వెళ్లకూడదు. అంతే కాకుండా రాజకీయ పార్టీల నాయకులతో శశికళ మాట్లాడకూడదు. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ శశికళను కలవకుండా తంజావూరు పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఆమెతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని తెలిసింది.