ముగిసిన శశికళ జైలు జీవితం... పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి,అన్నాడీఎంకె బహిష్కృత నేత వీకె శశికళ జైలు జీవితం ముగిసింది. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. ప్రస్తుతం కరోనా కారణంగా బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో శశికళ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం... మరో 14 రోజులు ఆమె ఐసోలేషన్లోనే ఉండనున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
శశికళతో పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బంధువులు ఇళవరసి,సుధాకర్లు కూడా బుధవారమే విడుదలవనున్నట్లు సమాచారం.మరోవైపు శశికళ మద్దతుదారులు,ఆప్తులు ఇప్పటికే విక్టోరియా ఆస్పత్రికి చేరుకుని ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి 1000 వాహనాలతో బెంగళూరు నుంచి చెన్నైకి ర్యాలీగా వెళ్లాలని శశికళ మద్దతుదారులు భావించారు. కానీ కోవిడ్ 19 నిబంధనల కారణంగా కర్ణాటక ప్రభుత్వం అందుకు అనుమతినివ్వలేదని తెలుస్తోంది.
మరోవైపు శశికళ విడుదల రోజే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి జయలలిత స్మారక నిలయాన్ని ప్రారంభించారు. శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకునేది లేదని ఇటీవల సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చొపెట్టిన శశికళనే ఆయన ధిక్కరించడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లినందునా... శశికళ నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. కాబట్టి పరోక్షంగానే ఆమె తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే యోచనలో ఉన్నారు. అవసరమైతే బీజేపీతో కలిసి ముందుకెళ్లే యోచనలో శశికళ ఉన్నట్లు సమాచారం.
పలువురు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు కూడా ఆమెతో టచ్లో ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణపై స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
Recommended Video
All formalities have been completed. She is set free from all legal formalities. She will remain at the hospital as per medical advice: Raja Senthoor Pandian, advocate of Sasikala https://t.co/YbhqEThgB4 pic.twitter.com/2SZCUUJZU1
— ANI (@ANI) January 27, 2021