జయలలిత నెచ్చెలి వీకే శశికళకు నో పెరోల్: అసమ్మతి ఎమ్మెల్యేలతో భేటీకి ఛాన్స్ మిస్!
బెంగళూరు: జయలలితకు చెందిన ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివారలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళకు గట్టి ఎదురుదెబ్బ పడింది. తనకు రెండు వారాలు పెరోల్ మంజూరు చెయ్యాలని వీకే. శశికళ పెట్టుకున్న అర్జీని కర్ణాటక జైళ్ల శాఖ తిరస్కరించింది.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వీకే. శశికళతో పాటు ఆమె వదిన ఇళవరసి, వారి సమీప బంధువు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇళవరసి సోదరుడు తీవ్రఅనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తమిళనాడులో చికిత్స పొందుతున్న సోదరుడిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడానికి తనకు రెండు వారాల పాటు పెరోల్ మంజూరు చెయ్యాలని ఇళవరసి కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు మనవి చేశారు.
ఇళవరసితో పాటు వీకే. శశికళ కూడా తనకు రెండు వారాల పాటు పెరోల్ మంజూరు చెయ్యాలని జైళ్ల శాఖ అధికారులకు మనవి చేశారు. వీకే. శశికళ, ఇళవరసి అర్జీలు పరిశీలించిన జైళ్ల శాఖ అధికారులు పెరోలో మంజూరు చేసే విషయంలో పై అధికారులతో చర్చించారు.
ఇళవరసికి మాత్రం రెండు వారాలు పెరోల్ మంజూరు చెయ్యాలని, శశికళకు పెరోల్ మంజూరు చెయ్యకూడదని జైళ్ల అధికారులు పరప్పన అగ్రహార సెంట్రల్ జెళ్ల సిబ్బందికి సూచించారు. 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంపై మద్రాసు హైకోర్టు తీర్ప వచ్చిన సమయంలో తన మద్దతుదారులతో మాట్లాడాలని ప్రయత్నాలు చేసిన శశికళ తీవ్రస్థాయిలో నిరాశ ఎదురైయ్యింది.