ప్రెస్టిట్యూట్: మీడియాపై నోరుపారేసుకున్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ బుధవారం నాడు మరోసారి నోరు జారారు. వికె సింగ్ మీడియా, సోషల్ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్టిట్యూట్ అంటూ మండిపడ్డారు. అమిత్ షాకు పాదాభివనందనం చేసిన వ్యక్తి అంటూ వికె సింగ్ వీడియో సోషల్ మీడియాలో ఉంది.
దీనిపై ఆయనకు కోపం వచ్చింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షాకు పాదాభివందనం చేస్తున్న ఓ వ్యక్తి తానేనంటూ ప్రచారం చేసినవారు 'ప్రెస్టిట్యూట్'లు అని అభివర్ణించారు. పాదాభివందనం చేసిన వ్యక్తి విజయ్ పాల్ తోమార్ అని తెలిపారు.
ప్రాస్టిట్యూట్ అంటే వ్యభిచారం చేసేవాళ్లు అని అర్థం. తాను అమిత్ షాకు పాదాభివందనం చేస్తున్నట్లు మీడియాలో ప్రసారం కావడంతో.. అతని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని ప్రెస్టిట్యూట్ (ప్రెస్) అంటూ మండిపడ్డారు. గతంలోను అతను ఇదే పదంతో మీడియాపై నోరుపారేసుకున్నారు.
వికె సింగ్ చేసిన తాజా వ్యాఖ్యపై భారత మహిళా పాత్రికేయుల సంఘం (ఐడబ్ల్యుపిసి) అధ్యక్షురాలు టిఆకె రాజాలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీకె సింగ్ పైన సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రెస్టిట్యూడ్ అనే పదం బోరింగ్గా ఉందని, కొత్త పదంతో తమను తిట్టాలని సింగ్కు కొందరు చురకలు వేస్తున్నారు.