కనెక్షన్ కట్ : ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు వాడుతున్నట్లయితే జర భద్రం
మీ మొబైల్ ఫోన్ వాడుతున్నారా... అందులో వొడఫోన్ ఐడియా లేదా భారతీ ఎయిర్ టెల్ సంస్థలకు చెందిన సిమ్ వాడుతున్నారా... మీది పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే నెలకు మీరు రూ.35 కంటే తక్కువగా వాడుతుంటే మీ కనెక్షన్లను కట్ చేయనున్నాయి వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలు. ఇప్పటికే 250 మిలియన్ 2జీ కస్టమర్లను కంపెనీలు గుర్తించాయి.ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్ సిమ్ వినియోగిస్తున్న 100 మిలియన్ వినియోగదారులు నెలకు రూ.35 కంటే తక్కువగా వాడుతుండగా వొడాఫోన్కు వచ్చే సరికి ఈ సంఖ్య 150 మిలియన్గా ఉంది. ఇందు కోసమే భారతీ ఎయిర్ టెల్ సంస్థ దేశవ్యాప్తంగా రూ.35 ప్లాన్ను ప్రవేశపెట్టగా... వొడాఫోన్ కూడా ఐదు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో కనిష్టంగా రూ.35 ప్లాను ఉంది.
ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లు 330 మిలియన్ మంది ఉన్నట్లు ఆ సంస్థ భారత్ మరియు దక్షిణాసియా సీఈఓ గోపాల్ విటల్ తెలిపారు. ఇందులో కొందరు టెలినార్ కస్టమర్లున్నారు. ఇక 100 మిలియన్కు పైగా కస్టమర్లు నెలకు రూ. 35కంటే తక్కువగా వాడుతున్నారు. దీనివల్ల సంస్థకు ఎలాంటి లాభం ఉండటం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే వొడాఫోన్ కస్టమర్లు తమ సిమ్ను కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసమే వినియోగిస్తున్నారని ఆ సంస్థ సీఈఓ బాలేష్ శర్మ తెలిపారు. కొందరు అన్లిమిటెడ్ ప్యాకేజీలకు వెళుతుండగా మరికొందరు మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని అన్నారు. దీంతో తమ వ్యాపారం దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పారు.
ఇదిలా ఉంటే కనిష్టంగా రూ.35 ప్యాక్ను ప్రవేశ పెట్టడం వెనుక కొన్ని కారణాలున్నాయని చెబుతోంది ఎయిర్టెల్ సంస్థ. ప్రతి నెలా మినిమమ్ రూ. 35తో రీఛార్జ్ చేయించుకుంటే తమ రెవిన్యూ రూ. 100 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది.ఇలా సగం మంది అయినా తమ నెట్వర్క్ పై ఉంటూ నెలకు రూ.35 ప్లాన్ వేసుకుంటే నెలకు రూ.175 కోట్లు వస్తుందని వెల్లడించారు. అంతేకాదు 250 మిలియన్ సబ్స్క్రైబర్లు డ్యూయెల్ సిమ్ వాడుతున్నారు. అంటే ఒక సిమ్ను కేవలం ఇన్కమింగ్ కాల్స్కోసమే వినియోగిస్తున్నారు. ఆ సమయంలో కేవలం రూ.10తో రీఛార్జ్ చేసుకునేవారని చెప్పిన ఎయిర్ టెల్... ఆ డబ్బులు అయిపోతే ఇక ఇన్కమింగ్ కాల్స్కు మాత్రమే పరిమితం చేస్తున్నారని చెప్పింది. అందుకే రూ. 35 రీఛార్జీని ప్రవేశపెట్టినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఒక వేలప్రతి నెల రూ.35తో రీఛార్జ్ చేసుకుంటేనే కనెక్షన్ ఉంటుందని నిబంధన తీసుకొస్తే కచ్చితంగా రీఛార్జ్ చేసుకుంటారని కంపెనీ ఈ తరహా ఆలోచన చేసినట్లు చెప్పింది.
రూ. 35 కంటే తక్కువ రీఛార్జ్ చేసుకుంటున్న వారి కనెక్షన్లు తీసివేయడం వెనక మరో కారణం కూడా ఉందని ఎయిర్టెల్ సంస్థ చెబుతోంది. 2జీ నెట్వర్క్లను శాశ్వతంగా మూసివేసి వీరిని 4జీ నెట్వర్క్లోకి తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.