నా చెల్లెల్లికి ఓటేసి గెలిపించండి -రాహుల్ గాంధీ సెంటిమెంట్ -ఇంతకీ ఆమె ఎవరంటే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనం తుది అంకానికి చేరింది. చివరిదైన మూడో దశ పోలింగ్ శనివారం(నవంబర్ 7న) జరుగనుంది. రెండు దశల ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడో దశలో సెంటిమెంట్ రంగరించిన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను ఉద్దేశించి తన సొంత చెల్లెలు లాంటివారని చెబుతూ, ఆమెను కచ్చితంగా గెలిపించాలని ఓటర్ల నుంచి హామీ తీసుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..
బీహార్ ఎన్నికల మూడో దశలో కీలకమైన జిల్లాల్లో మధేపూరా ఒకటి. అది మాజీ జేడీయూ నేత, లోక్తాంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ స్వస్థలం. ఆ జిల్లాలోని బీహారిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పుడాయన కూతురు సుభాషిణి యాదవ్ బరిలోకి దిగారు. సుభాషిణి రాజ్రావు అత్తగారిది మధ్యప్రదేశ్ అయినప్పటికీ ఎన్నికల కోసమే ఆమె పుట్టిల్లయిన బీహార్ కు వచ్చారు.
అనారోగ్యంతో బాధపడుతోన్న శరద్ యాదవ్ ఆస్పత్రికే పరిమితమైపోగా, ఆయన కూతురు సుభాషిణి కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్ లో చేరారు. మహాకూటమి పొత్తులో భాగంగా బీహారీగంజ్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఆమె బరిలో నిలిచారు. సుభాషిణి తరఫున ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్ గాంధీ.. సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''సుభాషిణి శరద్ యాదవ్ నా చెల్లెలు. ఆమెను కచ్చితంగా గెలిపించాలి. మీ నాయకుడు శరద్ యాదవ్ కోసమైనా ఆ పని చేయండి''అని ఓటర్లను అభ్యర్థించారు.
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఇప్పటికే రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్ పూర్తికాగా, మిగిలిన 78 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగనుంది. ఈనెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే వివిధ రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.