చైనీస్ భాషలో ఓటర్లకు గాలం! తృణమూల్ కాంగ్రెస్ వినూత్న ప్రచారం!
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్లో తృణమూల్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. కోల్కతాలోని ఒక ప్రాంతంలో చైనీస్ భాషలో ప్రచారం నిర్వహిస్తోంది. ఇంతకీ ఎక్కడుందా ప్రాంతం? తృణమూల్ పార్టీ చైనా భాషలో ఎందుకు ప్రచారం చేస్తోంది?
కాలం చెల్లిన బాబు, మోదీ : స్పీడ్ బ్రేకర్ విమర్శలపై దీదీ కౌంటర్
చైనా భాషలో తృణమూల్ ప్రచారం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సౌత్ కోల్కతాలో చైనా భాషలో ప్రచారం చేస్తోంది. తాంగ్రా ఏరియాలోలోని గోడలపై తృణమూల్ కాంగ్రెస్కే ఓటు వేయండని నినాదాలు గోడలపై కనిపిస్తున్నాయి. వాటితో పాటు పార్టీ ఎన్నికల చిహ్నం, మమతా బెనర్జీ, పార్టీ అభ్యర్థి చిత్రాలు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. ఇలా వారి మాతృభాషలో ప్రచారం చేస్తూ చైనీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చైనా మూలాలున్న ఓటర్లు
తాంగ్రా ప్రాంతంలో దశాబ్దాలుగా చైనా మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. వారిలో దాదాపు 2వేల మందికి ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తాయి. అయితే ఈసారి కొత్తగా ఆలోచించిన తృణమూల్ కాంగ్రెస్.. చైనీస్ భాషలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నిజానికి అక్కడి ఓటర్లకు చైనీస్తో పాటు బెంగాలీ, హిందీ భాషలు వచ్చు. అయినా వారి మాతృభాషలో ప్రచారం చేస్తే ఎక్కువ లబ్ది పొందవచ్చని తృణమూల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే చైనా భాషలో పాంప్లెట్లు ముద్రించి పంచుతున్న టీఎంసీ, వీలైతే తమ అభ్యర్థికి చైనీస్ భాష నేర్పించి మరీ ప్రచారసభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
18వ శతాబ్దంలో చైనీయుల వలస
దాదాపు రెండు శతాబ్దాల క్రితమే చైనీయులు భారత్కు వలస రావడం మొదలుపెట్టారు. 18వ శతాబ్దంలో వ్యాపారం నిమిత్తం కోల్కతాకు వచ్చిన వారిలో తాంగ్రా ప్రాంతంలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. దీంతో ఆ ప్రాంతానికి చైనా టౌన్ అనే పేరు స్థిరపడింది. 1951 జనాభా లెక్కల ప్రకారం కోల్కతాలో అప్పటికి 5,710 మంది చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు షుగర్ రిఫైనింగ్ మిల్లులు ఏర్పాటు చేయగా.. మరికొందరు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు.