ఆర్ఆర్ నగర్ ఎమ్మెల్యే: జూన్ 6 నాయుడుకు అగ్నిపరీక్ష, స్కాం కేసు, ఎఫ్ఐఆర్, హైకోర్టులో!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) నియోజక వర్గం ఎమ్మెల్యేగా మే 31వ తేదీ గురువారం భారీ మెజారిటీతో విజయం సాధించిన మునిరత్న నాయుడుకు ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదురైయ్యింది. ఆర్ఆర్ నగర్ లో 9 వేలకు పైగా ఓటరు ఐడీ కార్డులు ఒకే అపార్ట్ మెంట్ అక్రమంగా పెట్టారనే ఓటరు ఐడీ స్కాం కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు నిందితుడిగా ఉన్నారు.
జాలహళ్ళి అపార్ట్ మెంట్
ఆర్ఆర్ నగర్ లోని జాలహళ్ళి లోని అపార్ట్ మెంట్ లో 9,000కు పైగా ఓటరు ఐడీ గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తయారు చేయించడానికే అపార్ట్ మెంట్ లో అక్రమంగా ఓటరు గుర్తింపు కార్డులు పెట్టారని బీజేపీ, జేడీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎన్నికల అధికారులు
అపార్ట్ మెంట్ మీద దాడి చేసిన పోలీసులు కంప్యూటర్లు, స్కానర్లు, 9,000 పైగా నకిలీ ఓటరు ఐడీ గుర్తింపు కార్డులు, మునిరత్న నాయుడు ఎన్నికల ప్రచార కరపత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులు జేఆర్. భాస్కర్, ఎస్. రాకేష్ ఫిర్యాదు చెయ్యడంతో జాలహళ్ళి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే నిందితుడు
ఓటరు ఐడీ గుర్తింపు కార్డుల స్కాం కేసులో పలువురు మహిళలతో పాటు 12 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటరు ఐడీల స్కాం కేసులో ఆర్ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు నిందితుడిగా ఉన్నారు. కేసు విచారణ చేసిన పోలీసులు న్యాయస్థానంలో చార్జ్ షీట్ సమర్పించారు.
ఎఫ్ఐఆర్ రద్దు
ఓటరు ఐడీ గుర్తింపు కార్డుల స్కాం కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనమీద నమోదు అయిన చార్జ్ షీటు రద్దు చెయ్యాలని ఆర్ఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. కక్షతో తన మీద కేసు నమోదు చేయించారని మునిరత్న నాయుడు ఆరోపిస్తున్నారు.
న్యాయమూర్తి
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కేఎన్. ఫణీంద్ర ఏకసభ్య బెంచ్ ముందు జూన్ 6వ తేదీ మునిరత్న నాయుడు అర్జీ విచారణకురానుంది. ఒక కేసుకు సంబంధించి రెండు ఫిర్యాదులు వేర్వేరుగా విచారణ చెయ్యడం అన్యాయమని, ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యాలని మునిరత్న నాయుడు న్యాయవాదులు వాదిస్తున్నారు.