కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్లో క్లీన్స్వీప్ చేసే ఛాన్స్
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఆ పార్టీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఇస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను సొంతంగా సాధించుకున్న బీజేపీ... మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా తెలుస్తోంది.
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీజేపీ లోక్సభ ఎలక్షన్లలో సత్తా చాటుతోంది. అక్కడ 25 లోక్సభ స్థానాలుండగా... 24 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బెంగాల్లో దీదీ కోటకు బీటలు వారినట్లే తెలుస్తోంది. 42 సీట్లున్న ఆ రాష్ట్రంలో బీజేపీ 20 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు చత్తీస్గఢ్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని పక్కన బెట్టిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అక్కడ అధికార కాంగ్రెస్కు బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తోంది.
అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. రాజస్థాన్లో కమలదళం క్లీన్ స్వీచ్ చేసే దిశగా పయనిస్తుండటం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. అటు ఛత్తీస్గఢ్లోనూ రెండు పార్టీల మధ్య పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కేరళ, పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు తన ప్రాభవాన్ని కోల్పోయాయి. పశ్చిమ బెంగాల్తో పాటు కేరళలో ఆ పార్టీ కనీసం ఒక్క సీటు గెల్చుకునే అవకాశం లేదని ట్రెండ్ను బట్టి తెలుస్తోంది.