ఓట్ల కోసం నేతల ఫీట్లు.. బూట్లు పాలిష్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి
భోపాల్ : ఎన్నికల వేళ నేతల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా హంగామా చేస్తుంటారు. ఛాయ్ కాస్తారు, దోశ వేస్తారు, గడ్డం తీస్తారు.. ఇలా కాదేదీ ఓట్లు అడగడానికి అనర్హమన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఓటర్లను ఆకర్షించడానికి తాము చేయలేనివి కూడా హుషారుగా చేసేస్తారు. తాజాగా ఇలాంటి వేషమే వేశారు ఒక అభ్యర్థి. ఇంకో అడుగు ముందుకేసి ఓటర్ల బూట్లకు పాలిష్ చేస్తూ తన మనసులో మాట బయట పెట్టారు. ఓట్లు తనకే వేయాలంటూ అభ్యర్థించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగింది ఈ ఘటన.
ఓట్ల కోసం ఫీట్లు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న "రాష్ట్రీయ అమ్ జన్ పార్టీ" కి చెందిన శరద్ సింగ్ కుమార్ వినూత్న ప్రచారానికి తెర తీశారు. అందరిలా ఉంటే తన స్పెషాలిటీ ఏంటనుకున్నారో ఏమో గానీ ఓటర్ల బూట్లు పాలిష్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పార్టీ గుర్తు కూడా "బూటు" కావడంతో ఇంకా ఏమి ఆలోచించలేనట్లున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కనిపించిన ఓటర్లకల్లా బూట్లు పాలిష్ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. అయితే ఎన్నికల వేళ ఆయా పార్టీలు "బూటు" గుర్తును తీసుకునేందుకు ఇష్టపడలేదని.. తాము మాత్రం ఆ గుర్తును తీసుకుని బరిలోకి దిగినట్లు చెబుతున్నారు శరద్ సింగ్. ఇదే అంశం ప్రజలకు వివరించే క్రమంలో తాను బూట్లు పాలిష్ చేస్తున్నానని.. అందులో తనకేమీ తప్పు కనిపించలేదని అంటున్నారు. మరోవైపు 28న ఎన్నికలు జరగనుండటంతో సోమవారంతో ప్రచారం ముగియనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.
తెలంగాణలోనూ సేమ్ అలాంటి ప్రచారమే..!
తాజాగా తెలంగాణలో కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆకుల హన్మాండ్లు అనే స్వత్రంత్ర అభ్యర్థి చెప్పులు, రాజీనామా పత్రాలు పంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన విజిల్ గుర్తు మీద బరిలో నిలిచారు. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొత్త తరహా ప్రచారానికి తెర లేపారు. బజ్జీలు వేయడం, పిల్లల్ని ముద్దాడటం పాత స్టైల్ అనుకున్నారో ఏమో గానీ ఢిఫరెంట్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఓటర్లకు చెప్పులతో పాటు రాజీనామా పత్రాలు అందించారు. ఒకవేళ తాను గెలిచి పనులు చేయకుంటే ఇవే చెప్పులతో తనను కొట్టాలని పిలుపునిచ్చారు. ఇక ఎమ్మెల్యేగా తాను అన్ ఫిట్ అనుకుంటే ఈ రాజీనామా పత్రాలు అసెంబ్లీకి పంపించి పదవిలో నుంచి దించేయాలని కోరారు.
ఫీట్లతో ఓట్లు రాలేనా..! అదంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమేనా?
ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసే ఇలాంటి ప్రచార ప్రయత్నాలు కలిసొస్తాయా అనేది డౌటే. ఎన్నికల వేళ బరిలో నిలిచిన అభ్యర్థులు ఇలాంటి ప్రచారాలు ఎన్నో రకాలుగా చేసినా.. ఆశించిన స్థాయిలో ఓట్లు రాలవనేది ఒక అంచనా. ప్రజలతో కలిసిపోయినట్లుగా షో చూపించుకోవడానికే తప్ప వీటితో ప్రయోజనం అంతంతమాత్రమే ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఇలాంటి ప్రచారాలతో ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతోంది. పైసా ఖర్చు లేకుండా జాతీయ స్థాయి మీడియాలో వీటికి చోటు దక్కుతున్నాయి. దీంతో గెలిచినా ఓడినా తమ పేరు మాత్రం జనాల్లోకి వెళుతోందిగా అనేది అభ్యర్థుల ప్రచార మంత్రంగా కనిపిస్తోంది.