అతని నాయకత్వాన్నే కోరిన ఇతర పార్టీ ఓటర్లు: సీఎస్డీఎస్-లోక్నీతి
దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఎవరు గెలిచి అధికారంలోకి వస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా సీఎస్డీఎస్ లోక్నీతి సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వారడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ఓటర్లు విభిన్నమైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ వారడిగిన ప్రశ్నలేంటి..? ఓటర్లు ఇచ్చిన సమాధానం ఏమిటి..?
ప్రధాని అభ్యర్థిని చూసే ఓట్లు వేశామంటున్న ఓటర్లు
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు బీజేపీ నాయకులు కమలం గుర్తుపై వేసిన ప్రతి ఓటు ప్రధాని మోడీకి వేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే వీరు చేసిన ప్రచారం కొంతమంది ఓటర్లను ఆకట్టుకుంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న ఓటర్లు మోడీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలువురు ఓటర్లను సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ పలు ప్రశ్నలు వేసింది. ఓటు వేసేముందు పార్టీని చూసి ఓటువేశారా లేక అభ్యర్థిని చూసి ఓటువేశారా అనే ప్రశ్నించింది. అయితే 17శాతం మంది ఏదీ కాదని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో తాము ప్రధాని అభ్యర్థిని చూసి ఓటు వేశామని చెప్పారు. అయితే ఈ ఆప్షన్ను తాము అడిగిన ప్రశ్నలకు ఇవ్వలేదని సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి అధికారం కట్టబెట్టేందుకు ఈ సమాధానమే ముఖ్యకారణంగా నిలుస్తోందని ఆసంస్థ తెలిపింది.
మోడీ నాయకత్వానికి జైకొట్టిన ఇతర పార్టీ ఓటర్లు
ఇక రాజకీయ పార్టీ కానీ , అభ్యర్థికానీ విస్మరించినట్లు కాదని చెప్పిన సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ 46 శాతం మంది పార్టీని చూసి ఓటు వేయగా.. 31 శాతం మంది అభ్యర్థిని చూసి ఓటు వేసినట్లు తమ అధ్యయనంలో తేలిందని సీఎస్డీఎస్-లోక్నీతి వెల్లడించింది. అయితే మోడీని చూసి ఓటువేసిన వారి సంఖ్య చాలా కీలకంగా మారిందని తెలిపింది. అంతేకాదు దేశానికి మోడీ నాయకత్వం కావాలని చాలామంది కోరుకుంటున్నారని సంస్థ వెల్లడించింది. ఇక ప్రతి ముగ్గురు బీజేపీ ఓటర్లలో ఒకరు, ప్రతి నలుగురు బీజేపీ మిత్రపక్షాల పార్టీల్లో ఒకరు మోడీని చూసే బీజేపీకి ఓటు వేసినట్లు సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ వివరించింది. ఇక యూపీఏ విషయానికొస్తే కాంగ్రెస్ మిత్ర పక్షాలకు చెందిన ఓటర్లు తమ నియోజకవర్గ అభ్యర్థిని చూసి ఓటు వేశారని సంస్థ పేర్కొంది. ఇక పార్టీలను చూసి ఓటు వేసిన వారిలో 55 శాతం ఓట్లు కమ్యూనిస్టు పార్టీకి పడగా... కాంగ్రెస్కు 54 శాతం ఓట్లు వచ్చినట్లు సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ స్పష్టం చేసింది.
పార్టీలను చూసి ఓట్లు వేసింది తక్కువ మంది
ఒడిషా, తమిళనాడు, మేఘాలయా, మణిపూర్లాంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకుడిని చూసి అక్కడి ఓటర్లు ఓటువేశారని అదే పార్టీని చూసి ఓట్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, మహారాష్ట్రాలు ఉన్నాయని సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ తెలిపింది. ఇక హిందీ ప్రధాన రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీలలో ఓటర్లు ప్రధాని అభ్యర్థిని దృష్టిలో ఉంచుకునే ఓటు వేసినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు సీఎస్డీఎస్-లోక్నీతి వివరించింది. సిట్టింగ్ అభ్యర్థికే బీజేపీ టికెట్ ఇవ్వడంతో... అక్కడి ఓటర్లు వారిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే కేంద్రంలో ప్రధానిగా మోడీ ఉండాలన్న ఒకే ఒక కారణంతో బీజేపీకి ఓటువేశారని సీఎస్డీఎస్-లోక్నీతి సంస్థ చెబుతోంది. ఇలా ప్రధాని అభ్యర్థిగా మోడీని చూసి ఓటు వేసిన వారి శాతం దాదాపు 53శాతంగా ఉంది.