అందంగా ఉంటే ఓట్లు పడవు: ప్రియాంకాగాంధీపై బీహార్ మంత్రి వ్యాఖ్యలు
Recommended Video
ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనగానే అధికార పక్షం నేతలు తమ నోళ్లకు పనిచెప్పారు. ప్రియాంకా గాంధీని జనరల్ సెక్రటరీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే రాహుల్ గాంధీ వైఫల్యం చెందారు కాబట్టే ప్రియాంకా గాంధీని తెరపైకి కాంగ్రెస్ తీసుకొచ్చిందంటూ నేతలు విమర్శలు గుప్పించారు. అధికారపక్షం విపక్షంపై లేదా విపక్షం అధికారపక్షంపై విమర్శలు సంధించుకోవడం చాలా కామన్. అయితే బీహార్కు చెందిన మంత్రి వినోద్ నారాయణ్ ఝా మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి ప్రియాంకా గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు.
అందంగా ఉన్న ప్రియాంకాగాంధీకి ఓట్లు పడవు
బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ప్రియాంకాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందమైన ముఖాలకు ఓట్లు రాలవు అంటూ ప్రియాంకా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా భూకుంభకోణాలకు పాల్పడ్డాడని ఘాటు కమెంట్స్ చేశారు. అందమైన ముఖం కలిగి ఉన్న ప్రియాంకాగాంధీకి ఓట్లు పడవు అని చెప్పిన మంత్రి వినోద్... భూకుంభకోణంకు పాల్పడిన రాబర్ట్ వాద్ర సతీమణి ప్రియాంకా అని ధ్వజమెత్తారు. ప్రియాంకా గాంధీ అందంగా ఉంటుంది అంతకు మించి ఆమె రాజకీయంగా ఏమి సాధించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వినోద్.
అవినీతి పరుడైన రాబర్ట్ వాద్రా భార్యగానే ప్రియాంకాను చూస్తాం
ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూకుంభకోణాలకు పాల్పడి రెండు రాష్ట్రాల్లో కేసులను ఎదుర్కొంటున్నాడని అలాంటి వాడికి భార్యగా ఉన్న ప్రియాంకాను కాంగ్రెస్ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని ఆరోపించారు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ. రాబర్ట్ వాద్రా చేసిన స్కాములను ప్రజలకు వివరిస్తామని తమ ప్రచారంలో ఈ అంశం ఎంతో మేలుచేస్తుందని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఎంట్రీ తమకు ఎంతో మేలుచేస్తుందని అలాంటప్పుడు ఆమెను విమర్శించాల్సిన పనిలేదని బీజేపీ నేతలు చెప్పారు. ఎస్పీ బీఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టే ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చిందని ... ఇప్పుడు కంగారుపడాల్సింది అఖిలేష్ యాదవ్ మాయావతిలే అని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు.
ఇందిర పోలికలుంటే సరిపోదు...
ప్రియాంకాను మాజీ ప్రధాని ఇందిరతో పోల్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్న సుశీల్ కుమార్ మోడీ... మరొకరి పోలికలతో ఉన్నవారికి అసలైన వ్యక్తి ఒరిజినాలిటీ రాదని అన్నారు. అలా అయితే దేశంలో ఎంతోమంది అమితాబచ్చన్లు, విరాట్ కోహ్లీలు తయారయ్యేవారని చెప్పారు. రాజకీయాల్లో డూప్లికేట్లు పనికిరారని చెప్పారు. ప్రియాంక ఇందిరా పోలికలతో ఉండొచ్చు... కానీ ఆమెలా ఉండలేదు అని సుశీల్ కుమార్ మోడీ వెల్లడించారు.