దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలివిడత పోలింగ్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో 17ఎంపీ స్థానాలకు .. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు పెరగక ముందే వీలైనంత తొందరగా ఓటు హక్కు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు.
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరే
కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఇప్పటికే భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలు కట్టారు. మాక్ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో అధికారులు వాటిని సరిచేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. తెలంగాణలో సాయంత్రం ఐదింటి వరకు, ఆంధ్రప్రదేశ్లో ఆరు గంటలలోపు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.