మళ్లీ తెరపైకి వీవీఐపీ చాపర్ స్కామ్..నేతల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు
గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న వీవీఐపీ చాపర్ స్కామ్ మరో సారి తెరపైకి వచ్చింది. అగస్టా వెస్ట్లాండ్ చాపర్ స్కామ్లో అసలైన లబ్ధిదారులు ఎవరనేదానిపై ఈడీ సీబీఐలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే రియాల్టీ సంస్థ ఎంజీఎఫ్ ఎండీ శ్రావణ్ గుప్తా నివాసంలో సోదాలు నిర్వహించింది ఈడీ, సీబీఐ. ఇదిలా ఉంటే సీబీఐ త్వరలోనే ఐదుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులపై చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రిటన్కు చెందిన మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ పేరును కూడా చేర్చనుంది. ఇప్పటికే విచారణ చేసేందుకు సీబీఐ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. రానున్న నెలల్లో చాపర్ స్కామ్పై ఎన్నో డెవలప్మెంట్స్ ఉంటాయని ఈడీ చెబుతోంది.
శ్రావణ్ గుప్తా ఇంటిపై ఈడీ సోదాలు
ఎమ్మార్ ఎంజీఎఫ్ డైరెక్టర్గా ఉన్న సమయంలో చాపర్ స్కామ్లో శ్రావణ్ గుప్తా పాత్రపై కూడా ఈడీ సీబీఐలు ఆరా తీస్తున్నాయి. ఈ స్కామ్లో యూరోప్కు చెందిన మరో మధ్యవర్తి గిడో హష్కేను గుప్తా పరిచయం చేసుకున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్గా కంపెనీలోకి 2009లో శ్రావణ్ గుప్తా తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారణ సంస్థలు హాష్కేకు కోసం వేట కొనసాగిస్తున్నాయి. అయితే ఇటలీలో హాష్కే ఉన్నట్లు సమాచారం. 2016లో శ్రావణ్ గుప్తాను ఈడీ ప్రశ్నించింది. ఇక వీవీఐపీ చాపర్ స్కామ్లో ఈడీ ఇప్పటికే అరడజనుకు పైగా చార్జ్షీట్లు దాఖలు చేసింది. మొత్తం 12 చాపర్స్ కు సంబంధించి రూ. 3727 కోట్లు డీల్ దక్కించుకునేందుకు పలువురికి లంచం ఇవ్వజూపారు. ఇందులో క్రిస్టియన్ మైఖేల్ మరియు గిడో రాల్ఫ్ హష్కేలు కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ సీబీఐలు గుర్తించాయి. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్లు విచారణ సంస్థలు గుర్తించాయి.
ఎక్కువకు కొటేషన్ దాఖలు చేసిన అగస్టావెస్ట్లాండ్
ఇక సెప్టెంబర్ 2017లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ పలు ఆసక్తికర విషయాలను పొందుపర్చింది. అగస్టా వెస్ట్లాండ్తో క్రిస్టియన్ మైఖేల్ రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నారని వెల్లడించింది. ఇదంతా ఒక కుటుంబానికి మేలు చేసేందుకు జరిగిన ఒప్పందంగా సీబీఐ గుర్తించింది. అయితే 12 చాపర్ల కోసం ముందుగా సికోర్స్స్కీ అనే సంస్థ రూ.2,228 కోట్లతో కొటేషన్ ఇవ్వగా.. అగస్టా వెస్ట్లాండ్ సంస్థ రూ.3,966 కోట్లుకు కొటేషన్ ఇచ్చింది. ఇది సికోర్స్స్కీ సంస్థ కంటే 80శాతం ఎక్కువ. అయినప్పటికీ దీనికే 2010లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జరిగిన బేరసారాల్లో రేటును రూ.3727 కోట్లకు కుదించడం జరిగింది.
కేసులో కొత్త ఆధారాలు దొరికాయన్న ఈడీ
ఇక కేసులో కొత్త ఆధారాలు దొరికాయని దీంతో మరో ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ తెలిపింది. ఇందులో ఇంకా ఎవరెవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. ఇందులో రాజకీయనాయకులు,బ్యూరోక్రాట్లు కూడా ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని వారు వారి సంస్థలపై కూడా దాడులు నిర్వహిస్తామని ఈడీ స్పష్టం చేసింది. శ్రావణ్ గుప్తాను మరోసారి విచారణకు పిలుస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే గుప్తాకు కానీ ఎమ్మార్ సంస్థకు కానీ ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మార్ ఇండియా ఒక ప్రకటనప విడుదల చేసింది. గుప్తా ఈ కంపెనీతో ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నాడని ఎమ్మార్ ఇండియా ఇప్పుడు పూర్తిగా తన మాతృసంస్థ కిందకు వెళ్లిపోయిందని ప్రకటనలో పేర్కొంది. అయితే ఒక బాధ్యతగల సంస్థగా ఎమ్మార్ ఇండియా ఎలాంటి విచారణకైనా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.