జైల్లో శశికళకు మళ్లీ వీవీఐపీ సేవలు, ఆర్ టీఐ అర్జీతో వెలుగులోకి, సుప్రీం కోర్టులో, సిస్టర్ !
అన్నాడీఎంకే (అమ్మ) నాయకుల చిన్నమ్మ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని మరో సారి వెలుగు చూసింది.
బెంగళూరు: అన్నాడీఎంకే (అమ్మ) నాయకుల చిన్నమ్మ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని మరో సారి వెలుగు చూసింది. సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ) నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద శశికళ భాగోతం మరోసారి వెలుగులోకి తీసుకు వచ్చారు.
శశికళలను సాధారణ ఖైదీలగా చూడవలసిన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు ఆమెకు ఎక్కడ లేని మర్యాదలు చేస్తున్నారని, సాక్షాదారాలతో సహ తాను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని నరసింహమూర్తి తనను కలిసిన మీడియాకు చెప్పారని తమిళ సాయంకాల దినపత్రిక తమిళ్ మురసు కథనం ప్రచురించింది.
జైల్లో శశికళ వీవీఐపీ
జైల్లో శశికళ అసాధారణ ఖైదీగా సేవలు చేయించుకుంటున్నారని, జైలు అధికారులు, సిబ్బందితో ఆమె సిస్టర్ అని పించుకునే స్థాయికి ఎదిగారిని నరసింహమూర్తి అంటున్నారు. శశికళ జైలు జీవితం గురించి తాను సమాచార హక్కు చట్టం కింద ఈ పూర్తి వివరాలు సేకరించానని నరసింహమూర్తి మీడియాకు చెప్పారు.
Recommended Video
డీఐజీ రూప ఏం చెప్పారు ?
శశికళకు జైల్లో ఐదు గదులు, ప్రత్యేక వంట గది, బయటి నుంచి మందులు, భోజనం, కాళ్లు, చేతులు మసాజ్ చెయ్యడానికి పనివారు, వంట చెయ్యడానికి ప్రత్యేకంగా ఓ వంట మనిషి ఇలా అనేక సౌకర్యాలు అందుతున్నాయని కర్ణాటక జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం ఇదే సందర్బంలో నరసింహమూర్తి గుర్తు చేశారు.
నెలకు రెండు సార్లు మాత్రమే
జైలు శిక్ష పడిన ఖైదీలు సాధారణంగా నెలకు రెండు సార్లు మాత్రమే తన కుటుంబ సభ్యులు, బంధువులను ములాఖత్ లో మాట్లాడటానికి అవకాశం ఉందని నరసింహమూర్తి వివరించారు. అయితే గత నెల (జులై)లో 1, 5, 6, 11, 28, 31 తేదీల్లో ఆరు సార్లు శశికళ తన వారిని కలుసుకున్నారని నరసింహమూర్తి చెప్పారు.
గంటలు గంటలు ములాఖత్
జైల్లో ఖైదీలు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ములాఖత్ లో తన వారితో మాట్లాడటానికి చట్టపరంగా అవకాశం ఉంది. అయితే శశికళ సాయంత్ర 6 గంటల తరువాత కూడా తన వారితో గంటలు గంటలు మాట్లాడారని తన దగ్గర సమాచారం ఉందని నరసింహమూర్తి వివరించారు.
జులై 11వ తేదీ ?
జులై 11వ తేదీన షకీలా, కీర్తన, జయ, వివేక్, తమిళసెల్వన్, వెట్రివేల్, నాగరాజ్ మొత్తం ఏడు మంది శశికళను కలిశారని నరసింహమూర్తి అన్నారు. వారిలో నలుగురు మాత్రం తాము శశికళ బంధువులు అని పేర్కొన్నారని, మిగిలిన ముగ్గురు ఏమీ స్పష్టం చెయ్యకుండా శశికళను కలుసుకున్నారని నరసింహమూర్తి ఆరోపించారు.
జయలలిత పర్సనల్ డాక్టర్
జులై 5వ తేదీన జయలలితకు గత సంవత్సరం వరకు వైద్యం చేసిన డాక్టర్ వెంకటేష్ (శశికళ బంధువు), టీటీవీ దినకరన్, వెట్రివేల్, కేవీ రామలింగం, పళనివేల్ (ఎమ్మెల్యేలు), తమిళ్ మగన్ హుస్సేన్ సందర్శకుల సమయం దాటిపోయినా శశికళతో ములాఖత్ లో మాట్లాడారని నరసింహమూర్తి అన్నారు.
ఏడు నెలల్లో 14 మంది, కానీ ?
శశికళను జైల్లో ఏడు నెలల్లో 14 మందితో మాత్రమే మాట్లాడే అవకాశం ఉందని, అయితే జైళ్ల శాఖ రిజిస్టర్ లో 52 మందితో ఆమె మాట్లాడారని అధికారికంగా ములాఖత్ అయ్యారని వివరాలు ఉన్నాయని, ఇది ఎలా సాధ్యం అని నరసింహమూర్తి ప్రశ్నించారు. అన్ని సాక్షాలతో తాను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి శశికళ బండారం మొత్తం బయటపెడుతానని నరసింహమూర్తి వివరించారని సోమవారం తమిళ సాయంకాల దినపత్రిక తమిళ్ మురసు కథనం ప్రచురించింది.