వ్యాపమ్: లేడీ ట్రైనీ ఎస్సైది హత్యా, ఆత్మహత్యా?
భోపాల్: వ్యాపం నియామకాల ద్వారా ఉద్యోగం పొందారని భావిస్తున్న మహిళా ట్రైనీ ఎస్సై అనామిక సికర్వార్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెది హత్యనా, ఆత్మహత్యా అనే విషయంపై అనుమానాలు చెలరేగుతున్నాయి. సాగర్ జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లోని శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్లో ఉన్న అనామిక మృతదేహాన్ని అకాడమీ పక్కనే కొలనులో సోమవారం కనుగొన్నారు.
ఆమె మృతిపై పోలీసులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పర విరుద్ధ కథనాలు వినిపిస్తున్నారు. అనామిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామని సాగర్ సిటీ ఎస్పీ సోలంకీ తెలిపారు. ఆమె వ్యాపం ద్వారా ఉద్యోగం పొందలేదని చెప్పారు. ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కూడా ఇదేవిధమైన ప్రకటన చేశారు.
పోలీసుల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. అనామిక మృతికి వ్యాపం కుంభకోణంతో సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్సింగ్, రణ్దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఈ మరణాలన్నింటికీ సీఎం శివరాజ్సింగ్చౌహాన్దే బాధ్యత అని వారన్నారు. ఈ స్కాం మృత్యువ్యాపారి (మర్చంట్ ఆఫ్ డెత్)గా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
వ్యాపం కుంభకోణానికి శివరాజ్సింగ్చౌహానే సూత్రధారి అని కాంగ్రెస్ మరో నేత పీసీ చాకో ఆరోపించారు. ఈ స్కాం నుంచి ఆయన తప్పించుకోలేరని స్పష్టంచేశారు. ఈ మరణాలకు ప్రధాని నరేంద్రమోదీ బాధ్యత వహించాలని అన్నారు. వ్యాపం స్కాంలో మరొకరు మరణించకముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరాలని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం సూచించారు.
మరోవైపు వ్యాపం కుంభకోణాన్ని వెలికితీసిన ఐర్టీఐ కార్యకర్తలు ఆశిష్చతుర్వేది, ఆనంద్రాయ్లు తమ ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీఎం చౌహాన్కు కుంభకోణంలో ప్రత్యక్షంగా సంబంధం ఉందని ఆశిష్ తెలిపారు.
కాగా, వ్యాపం మరణాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రె స్ డిమాండ్ను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ తిరస్కరించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిష్పక్షపాతంగానే దర్యాప్తు జరుపుతున్నదని తెలిపారు. హైకోర్టుకుగానీ, సుప్రీంకోర్టుకుగానీ తాము ఆదేశాలు ఇవ్వలేమని, కోర్టుల అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు సాధ్యంకాదని సోమవా రం ఝబువాలో స్పష్టంచేశారు. అనవసరమైన విషయాలపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించారు.
సిట్ దర్యాప్తుపై హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇప్పటికే అనేకసార్లు పూర్తి విశ్వాసం వ్యక్తంచేశాయని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎస్సై అనామికతోపాటు జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్మిశ్రా మృతికి కూడా వ్యాపం కుంభకోణం తో సంబంధంలేదని మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తం మిశ్రా అన్నారు.