కాశ్మీర్ కోసం బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతాలో దాడులు చేస్తాం: ఆల్ ఖైదా, హై అలర్ట్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ వదులుకోవాలని, లేకపోతే బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఆల్ ఖైదా ఉగ్రవాదులు వీడియో విడుదల చేశారు. నూతన సంవత్సరం వేడుకల సమయంలో దాడి చేస్తామని ఆల్ ఖైదా హెచ్చరించింది.
భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ముమ్మరం చెయ్యడానికి కాశ్మీర్ యువకులను ఉపయోగించుకుంటామని, వారి కోసం వేట మొదలైందని ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఉసామ మహమ్మద్ మాట్లాడిన 42 నిమిషాల వీడియో విడుదలైయ్యింది.
జీహాద్ ఇన్ కాశ్మీర్ పేరుతో విడుదలైన వీడియో రెండవ భాగంలో భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని ఉసామ మహమ్మద్ చెప్పాడు. కాశ్మీర్ ను భారత్ వదులుకోవాలని, లేదంటే దేశంలో రక్తపాతం మొదలు అవుతోందని ఉసామ మహమ్మద్ హెచ్చరించాడు.
దేశంలో కాశ్మీర్ ఎంతో చిన్న ప్రాంతం అని, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆరు లక్షల మంది భద్రతా సిబ్బందిని నియమించిందని ఉసామ మహమ్మద్ చెప్పాడు. కాశ్మీర్ లోనే ఎక్కువ భద్రతా సిబ్బంది ఉన్నారని, అదే అదును చూసుకుని భారతదేశంలోని ఇతర నగరాల్లో దాడులు చేస్తామని ఉసామ మహమ్మద్ హెచ్చరించాడు. ఆల్ ఖైదా ఉగ్రవాదులు హెచ్చరికతో ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా తదితర నగరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.