అదృష్ట సంఖ్య, కరుణకు షాకేనా: జయలలితదే గెలుపు
చెన్నై: తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరగనుందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని మాత్రం జయలలితకే మరోసారి అధికారం దక్కనుందని చెబుతున్నాయి. అయితే, అదృష్ట సంఖ్య చూస్తే మాత్రం జయలలిత వైపే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా తమిళనాడు పైనే ఇప్పుడు అందరి ఆసక్తి ఉంది. కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
తమిళనాడు విషయంలో మాత్రం ఎక్కువ సర్వేలు కరుణానిధి వైపు, కొన్ని సర్వేలు మాత్రం జయలలిత వైపు మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్రంలోని స్థానిక మీడియా నిర్వహించిన ఫలితాలు మాత్రం జయలలిత వైపు అనుకూలంగా ఉన్నాయి. మొత్తంమీద ఈ ఫలితాలు ఉత్కంఠ పోరును తలపిస్తున్నాయి.
అయితే, అన్నాడీఎంకే శ్రేణులు మాత్రం విజయం తమదేని ఘంటాపథంగా చెపుతున్నారు. దీనికి కారణాలు కూడా వారు వివరిస్తున్నారు. నిజానికి ఎగ్జిట్పోల్స్ ఫలితాలు పాలక పక్షాన్ని కలవరపెడుతున్నప్పటికీ అన్నాడీఎంకే నేతలు మాత్రం మళ్లీ విజయం మాదేనన్న ధీమాలో ఉన్నారు.
జయలలిత అదృష్ట సంఖ్య ప్రకారం విజయం తథ్యమంటున్నారు. జయలలిత ఓటు వేయడానికి బయలుదేరిన సమయం నుంచి ఓటు వేయడం, ఓటరు సంఖ్యతో సహా అన్నీ లెక్కగట్టి.. సంఖ్యాశాస్త్రం ప్రకారం విజయం తప్పకుండా వరిస్తుందని ఆమె అనుయాయులు అనుకుంటున్నారు. ఆమె లక్కీ నెంబర్ 2.
ఓటు వేసిన తర్వాత మరో రెండు రోజుల్లో తెలుస్తుందని మళ్లీ రెండుపైనున్న తన ప్రేమను జయలలిత చాటుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు తమకు కలిసిరావడంతో పాటు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో తమ అధినేత్రి కూర్చుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.