తాజ్మహల్ మాదే.. షాజహాన్ మాకు రాసిచ్చాడు: సున్నీ వక్ఫ్ బోర్డు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ను దాని నిర్మాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చాడని ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు విన్నవించింది. తాజ్ మహల్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సున్నీ వక్ఫ్ బోర్డు చాలాకాలంగా పోరాడుతోంది.
ఈ నేపథ్యంలో 2010లో వక్ఫ్ బోర్డు వాదనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఏఎస్ఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జరిగిన తాజా విచారణలో.. ఆధారాలు సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు వక్ఫ్ బోర్డును ఆదేశించింది.
మొఘల్ చక్రవర్తి తాజ్ మహల్ ను రాసిచ్చినట్టుగా చెబుతున్న డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. షాజహాన్ చేసిన డిక్లరేషన్ కాకుండా మరే ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సున్నీ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం వారం రోజుల గడువును ఇచ్చింది.
తాజ్ మహల్ మాదే అని వాదించడంపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మాట ఇండియాలో ఎవరైనా నమ్ముతారా?, అవనవసరంగా కోర్టు సమయాన్ని వృథా చేయరాదు! అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ముస్లిం మతానికి చెందిన భూములు, ఆస్తులు, వైద్య, స్వచ్చంద కార్యక్రమాలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం తాజ్మహల్తో పాటు దేశ సాంస్కృతికను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకున్న సంగతి కూడా తెలిసిందే.