కదం తొక్కిన 35 వేల మంది రైతులు.. కాలినడకన ముంబైకి.. ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆందోళన!
Recommended Video
ముంబై: తాము ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ దాదాపు 35 వేల మంది రైతులు కదం తొక్కారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అయిదు రోజులు క్రితం కాలినడకన ముంబైకి బయలుదేరారు.
మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన రైతులు 180 కిలోమీటర్లు నడిచి ముంబైకి చేరుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలో పడింది మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం. ముందు జాగ్రత్త చర్యగా ముంబైలో అడుగడుగునా పోలీసులను మోహరించింది.
అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ ప్రధాన డిమాండ్గా, గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎరువులు, పురుగుమందులను సబ్సిడీకి ఇప్పించాలని కోరుతూ వేలాది మంది రైతులు సోమవారం విధానసభ ముట్టడి కోసం నగరానికి చేరుకున్నారు.
అయితే రైతుల ఆందోళన నేపథ్యంలో ముంబై మహా నగరాన్ని పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ను నిలిపేశారు.
ఈ రైతుల ఆందోళనకు మహారాష్ట్ర విపక్షాలు, శివసేన తదితర పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రకటించారు.