Namaste Trump: మురికివాడలు కనిపించకుండా కట్టిన అడ్డుగోడలపై అందమైన బొమ్మలు..!
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాత్ పర్యటన మరో ఆరు రోజుల్లో ఆరంభం కానుంది. అమెరికా నుంచి నేరుగా ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. భార్య మెలానియా ట్రంప్తో సహా ఆయన భారత పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గుజరాత్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ కంట పడకుండా మురికివాడలకు అడ్డుగోడ: అప్పట్లో బిచ్చగాళ్లను తరలించినట్టే..!
అడ్డుగోడలపై అందమైన పెయింటింగ్స్
డొనాల్డ్ ట్రంప్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని మురికివాడలు ఆయన కంట్లో పడకుండా.. అడ్డుగా కట్టిన గోడలను అందంగా అలంకరించారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఆ గోడలపై పూల మొక్కలను అమర్చారు. ఆకుపచ్చని రంగుతో నింపేశారు. నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ పెయింటింగ్లను వేశారు. భారత్, అమెరికా మధ్య గల దౌత్య సంబంధాలను ఉటంకిస్తూ రూపొందించిన స్లోగన్లను రాశారు. స్వచ్ఛభారత్ గురించీ ప్రస్తావించారు.
అహ్మదాబాద్ వ్యాప్తంగా హోర్డింగులు..
ట్రంప్ పర్యటన గడువు సమీపిస్తోన్న కొద్దీ ఆయన స్వాగత ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. అహ్మదాబాద్ నగరం వ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీలతో కూడిన బ్యానర్లు, హోర్డింగులు గంపగుత్తగా వెలుస్తున్నాయి. ప్రత్యేకించి- ట్రంప్ రాకపోకలు సాగించే మార్గంలో భారీ ఎత్తున, అత్యంత ఆకర్షణీయంగా వాటిని ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. నమస్తే ట్రంప్, కెమ్ ఛో ట్రంప్ అనే నినాదాలను వాటిపై ముద్రించారు.
మొతెరా స్టేడియం వద్ద మురికివాడలు ఖాళీ..
ఇదిలావుండగా.. డొనాల్డ్ ట్రంప్ పాల్గొనాల్సి ఉన్న మొతెరా స్టేడియం సమీపంలోని మురికివాడలను ఖాళీ చేయించారు అధికారులు. అక్కడి నివాసులను ఇతర ప్రాంతాలకు తరలించారు. అక్కడ కూడా మురికివాడలు కనిపించకుండా గోడను కట్టారు. మురికివాడల నివాసితులను షెల్టర్ జోన్లకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పించామని అంటున్నారు. అధికారుల ఈ చర్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video
రోడ్షో కోసం కట్టుదిట్టమైన భద్రత..
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొతెరాలోని సర్దార్ వల్లభ్భాయ్ స్టేడియం వరకూ నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ రోడ్షోను నిర్వహించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడానికి గుజరాత్ పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ట్రంప్ పర్యటన కొనసాగినన్ని రోజులు కూడా 24 గంటల పాటు పహారా కాసేలా ఏర్పాట్లు చేసింది. గుజరాత్ పోలీసు యంత్రాంగంతో పాటు పెద్ద ఎత్తున పారా మిలటరీ బలగాలను మోహరించనున్నారు.