వాల్మార్ట్ షాకింగ్ డెసిషన్: ఆ ఉద్యోగస్తులపై వేటు పడింది..ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద రీటెయిల్ సంస్థ వాల్మార్ట్ భారత్లోని తన బ్రాంచ్లో పనిచేస్తున్న 56 మంది ఎగ్జిక్యూటివ్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా పలు సవాళ్లను ఎదురుకాగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనడంలో విఫలైమనట్లు యాజమాన్యం తెలిపింది. ఆసియా దేశాల్లో 28 హోల్సేల్ స్టోర్లను వాల్మార్ట్ సంస్థ నిర్వహిస్తోంది. చిన్న తరహా వ్యాపారస్తులకు వాల్మార్ట్ వస్తువులను విక్రయిస్తుంది.
వేటుపడ్డ వారు ఎక్కువగా రియల్ ఎస్టేట్ విభాగం వారే..
వాల్మార్ట్లోని రియల్ ఎస్టేట్ విభాగంకు సంబంధించిన ఉద్యోగులనే ఎక్కువగా యాజమాన్యం తొలగించినట్లు సమాచారం. సంస్థలోని రియల్ ఎస్టేట్ విభాగం హోల్ సేల్ బిజినెస్ విస్తరణ బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవడం వృద్ధిరేటును కనబర్చకపోవడంతో ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసినట్లు యాజమాన్యం తెలిపింది. మొత్తం 56 మందిపై యాజమాన్యం వేటువేయగా అందులో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నవారు 8 మంది ఉన్నారు. ఇక మిగతావారంతా మిడిల్ మేనేజ్మెంట్, లోవర్ మేనేజ్మెంట్వారే అని వాల్మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ తెలిపారు.
ఫ్లిప్కార్ట్లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన వాల్ మార్ట్
ఇక నుంచి భవిష్యత్తుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు కార్పొరేట్ స్ట్రక్చర్ను పూర్తిగా మారుస్తున్నట్లు చెప్పారు అయ్యర్. అయితే తొలగించిన ఉద్యోగులందరికీ మంచి బెనిఫిట్స్ ఇస్తున్నామని అయ్యర్ ప్రకటించారు. ఇక భారత్ ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని అయ్యర్ తెలిపారు. 2016లో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో మెజార్టీ వాటా దక్కించుకునేందుకు 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు అయ్యర్ స్పష్టం చేశారు. ఏదైనా వస్తువులు కావాలంటే వినియోగదారులు స్టోర్లకు వెళ్లడం మానేశారని ఇక అంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నందునే ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు.
ఈ-కామర్స్లో ద్వారానే సేల్స్ను పెంచే ఆలోచన
భారత్లో కొత్త హోల్ సేల్ స్టోర్లను ప్రారంభించేందుకు వాల్మార్ట్ ఆలోచిస్తోంది. ఈ-కామర్స్ పద్ధతిలోనే తమ సేల్స్ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే స్టోర్ల సంఖ్యను కూడా పెంచుతామని అయ్యర్ స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడు అనేది వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ -కామర్స్తో పాటు బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లపై కూడా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు అయ్యర్ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్లోని వాల్మార్ట్ ప్రధాన కార్యాలయంలో 600 మంది సిబ్బంది ఉండగా... దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్లతో కలిపి 5300 మంది పనిచేస్తున్నారు.