బరువు తగ్గాలా? సీబీఐకి ఫోన్ కొట్టండి చాలు!: కార్తీ చిదంబరం సెటైర్లు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సీబీఐపై సెటైర్లు వేశారు. 'ఎవరైనా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. డైట్ పాటించాల్సిన పనిలేదు. సీబీఐ కస్టడీలో ఉండండి.. సీబీఐ క్యాంటీన్ ఆహారం తినండి' అంటూ కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు.
12రోజుల కస్టడీ అనంతరం మార్చి 24వరకు ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కార్తీని ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. సీబీఐ కస్టడీలో తాను బరువు చాలా తగ్గానని, చాలా తక్కువగా తినడం వల్లే ఇది సాధ్యమైందని, ఈ చిట్కా చాలా బావుందని కార్తీ చిదంబరం చమత్కరించారు.
అంతేగాక, తనకు కొత్త జత బట్టలు కావాలని, పాత బట్టలు బాగా వదులైపోయాయని చెప్పుకొచ్చారు. అందుకే ఎవరైనా బరువు తగ్గాలంటే సీబీఐకి ఫోన్ చెయ్యండి అంటూ కార్తీ నవ్వుతూ చెప్పారని ఓ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అయితే, సీబీఐ అధికారులపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, పూర్తిగా ప్రొఫెషనల్గా డీల్ చేస్తున్నారని చెప్పారు.
ఇంతకుముందు కార్తీ తనకు ప్రత్యేక సెల్, ఇంటి భోజనం లేదా హోటల్ భోజనం కావాలని కోర్టును కోరగా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో కార్తీ చిదంబరంను సీబీఐ ఫిబ్రవరి 28న అరెస్ట్ చేసింది. ఈ కేసులో సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతోంది. మార్చి 15న కార్తీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. కాగా, ఈ కేసులో కార్తీ చిదంబరం సీఏకు మంగళవారం బెయిల్ లభించింది.