మద్దాలికి ఎన్టీఆరే ఆదర్శం...ఇక రాజకీయాల్లో ఫుల్టైమ్
యూపీ: సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కొందరైతే ఏకంగా పార్టీలనే స్థాపించి అధికారంలోకి వచ్చిన దాఖలాలు చూశాం. వారినుంచి స్ఫూర్తి పొంది యువ కథానాయకులు కూడా ప్రజాసేవకు తమ వంతు కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ ప్రముఖ హీరో కమ్ విలన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్లో చేరి పెద్ద తప్పు చేశానని చెబుతున్నారు. తన గమ్యస్థానం ఎప్పటికీ బీజేపీనే అని తేల్చిచెప్పారు. ఈ హీరో కం విలన్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద తప్పుచేశా
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా... రవి కిషన్... ఇలా చెప్తే తెలుగువారు గుర్తుపట్టకపోవచ్చు. అదే మద్దాలి శివారెడ్డి అంటే టక్కున క్యాచ్ చేసేస్తారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం చిత్రంలో విలన్ పాత్రలో అలరించాడు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఈ భోజ్పూరి హీరో. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి జాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రవికిషన్. 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా పెద్ద తప్పు చేసినట్లు చెప్పుకొచ్చారు . ప్రస్తుతం ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు.
ఎన్టీఆర్, వినోద్ ఖన్నాలే నాకు స్ఫూర్తి
ఇక తను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎన్టీఆర్, వినోద్ ఖన్నాలే స్ఫూర్తి అని చెప్పారు రవికిషన్. వారిలా సీరియస్ రాజకీయనాయకుడిగా ఎదగాలన్న తపన తనలో ఉందని చెప్పారు. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్టీఆర్ వినోద్ఖన్నాలు ప్రజలకు సేవ చేసి తామేంటో నిరూపించుకున్నారని చెప్పారు. తనకు మంచి అవకాశం వస్తే వారిలానే సేవ చేయాలని భావిస్తున్నట్లు రవికిషన్ చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల పట్ల సీరియస్గా లేకపోతే ఎంతో విజయవంతంగా సాగుతున్న తన సినీ కెరీర్ను వీడి వచ్చేవాడిని కాదని రవికిషన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్లు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. రాజకీయాల పట్ల సీరియస్గా ఉన్నందువల్లే వారు తనను ఆశీర్వదించారని గుర్తు చేశారు.
దేశం బలంగా ఉంటేనే శతృవులు దాడి చేసేందుకు జంకుతారు
మోడీ పనితీరు నచ్చి మెచ్చి బీజేపీలో చేరడం జరిగిందని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు రవికిషన్. 2014లో టాయ్లెట్స్పై మోడీ మాట్లాడటం తనను ఆకట్టుకుందని చెప్పిన మద్దాలి శివారెడ్డి... తొలిసారిగా ఒక ప్రధాని మాట్లాడటం తనను ఆకట్టుకుందని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో జాతీయవాదం ప్రధానాంశంగా ఉండగా... దేశం సురక్షితంగా ఉంటేనే మన పిల్లలు క్షేమంగా ఉంటారని అలానే భవిష్యత్ తరాలు కూడా ధైర్యంతో ఉంటారని చెప్పారు రవికిషన్. సురక్షితమైన బలమైన దేశం ఉంటేనే శతృవులు దాడి చేసేందుకు జంకుతారని అభిప్రాయపడ్డారు. ఇక సమాజ్వాదీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీల కలయిక అపవిత్రమైనదని అభివర్ణించిన రవికిషన్... రాజీకీయ లబ్ధి కోసమే ఒక్కటయ్యారని మండిపడ్డారు.
నా ప్రధాన బలం గోరఖ్పూర్ యువతే
గోరఖ్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మోడీ, యోగీలు చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని... ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసమే వినియోగించడం జరుగుతోందని అన్నారు. ఈ ఎన్నికల్లో యువత తనవెంట ఉందని చెప్పిన రవికిషన్...వారే తన ప్రధాన బలం అని పేర్కొన్నారు. యోగీ ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో స్థానికేతరుడు పోటీ చేయడంపై వస్తున్న విమర్శలపై స్పందించారు రవికిషన్. గోరఖ్పూర్ గడ్డతో తనకు మంచి సంబంధాలున్నాయని ఇక్కడ ఓ ఇళ్లు కూడా కొనుకున్నట్లు చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక గోరఖ్పూర్లో ఒక స్టూడియో నిర్మించి... తన సినిమాలు ఇక్కడే చిత్రీకరణ జరిగేలా చూసి అదేసమయంలో ప్రజల సంక్షేమం కోసం కూడా పాటు పడుతానని చెప్పారు.