కర్ణాటక నుంచి వెళ్లాలి/రావాలి అనుకొంటున్నారా..? sevasindhu.karnataka.gov.inలో ఆప్లై చేయండి..
వలసకూలీలు, విద్యార్థుల సొంత రాష్ట్రాలకు వెళ్లొచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకుంటున్నాయి. ఇందులో కర్ణాటక ప్రభుత్వం ముందువరసలో నిలిచింది. కర్ణాటక రావాలని అనుకొంటున్నారా..? లేదా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఆన్లైన్లో ఆప్లై చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది.
కర్ణాటక నుంచి వెళ్లాలని అనుకొంటున్న వారు/లేదంటే రావాలని అనుకొంటున్న వారు sevasindhu.karnataka.gov.in వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. ఆన్ లైన్ కాకుండా బెంగళూరు వన్ కేంద్రాలు, బీబీఎంపీ వార్డు కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వాలని కోరింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొన్న వారిని స్వరాష్ట్రానికి తరలించేందుకు భారతీయ రైల్వేశాఖతో కర్ణాటక ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన లక్ష యాభై వేల మంది కర్ణాటకలో ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది.
వలసకూలీలను పంపించేందుకు కర్ణాటకకు ఐదు ర్యాకులు సిద్దం చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. ఒడిశా, బీహర్, జార్ఖండ్, రాజస్థాన్కు చెందిన కూలీలను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని నోడల్ అధికారి మంజునాథ్ ప్రసాద్ తెలిపారు. తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రాష్ట్రాలవారీగా విభజిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాల జాబితాపై క్లారిటీ వస్తే.. వారిని పంపించేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. తమ రాష్ట్రం నుంచి పంపించే ముందు స్క్రీనింగ్ చేశాకే పంపిస్తామని చెప్పారు.
రాష్ట్రం నుంచి వెళ్లేవారికి రైల్వేస్టేషన్ వరకు బస్సుల్లో దింపుతామని.. మిగతావారిని బస్సుల్లో పంపిస్తామని చెప్పారు. సామాజిక దూరం పాటించి, శానిటైజర్స్తో సహా పంపిస్తామని తెలిపింది. కానీ ప్రయాణికులు మాత్రం తమ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రానికి వచ్చేవారు కూడా ముందే పరీక్ష చేయించుకొని రావాలని కోరింది. ప్రతీ జిల్లాలో ఎంట్రీ పాయింట్ ఉంటుందని స్పష్టంచేసింది. చెక్ పోస్ట్ వద్ద పరీక్షలు చేస్తారని.. మంచినీటి సరఫరా, ఆహారం, తాత్కాలిక షెల్టర్, టాయిలెట్లు కూడా ఉంటాయని చెప్పారు.