చెప్పినట్లే మోడీ గుర్రాన్ని కట్టేశా: కుమారస్వామి, సర్దుకుపోండి.. మన అవసరం: సోనియాగాంధీ
బెంగళూరు: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి భిన్న వ్యక్తిత్వాలు కలిగిన పార్టీ అధినేతల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రధానికి చురకలు అంటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ తనను 12 ఏళ్ల క్రితమే వాడుకుందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తాను ఓ మాట చెప్పానని, నరేంద్ర మోడీ - అమిత్ షాల అశ్వమేథ గుర్రాన్ని కట్టివేస్తానని చెప్పానని, కర్ణాటకలో అది చేశానని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి బీజేపీ అశ్వమేథ గుర్రాన్ని కట్టివేశాయన్నారు. జీవం కోల్పోయిన ఆ అశ్వం త్వరలో నరేంద్ర మోడీ వద్దకు కూడా చేరుకుంటుందని చెప్పారు.
ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇంతమంది నేతలు రావడం చరిత్ర అన్నారు. వారు తనకు మద్దతు తెలపడానికి మాత్రమే రాలేదని, 2019 ఎన్నికల్లో మార్పు తేవడానికే వారంతా వచ్చారని వివరించారు. దేశాన్ని రక్షించేందుకు కాంగ్రెస్తో చేతులు కలపడం అనివార్యమన్నారు.
బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంపై జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడను మమతా బెనర్జీ అభినందించారన్నారు. భవిష్యత్తులో తామెలా కలిసి పని చేయాలన్న విషయంపై మమత పలు సూచనలు చేశారని తెలిపారు.
మన అవసరం, సర్దుకుపోవాలి: కన్నడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సోనియా, రాహుల్
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హితబోధ చేశారు. ఎమ్మెల్యేలు అందరు కూడా జేడీఎస్తో సర్దుకుపోవాలని సూచించారు. ప్రస్తుతానికి ఇది మన అవసరమని చెప్పారు.