అట్టుడుకుతున్న జమ్మూ కాశ్మీర్.. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు నిరంతర యుద్ధం.. తాజా పరిస్థితి ఇదే
భారతదేశంలో సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడి దాడులకు పాల్పడే అవకాశముందని ఎన్ఐఏ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న కొన్ని ప్రాంతాలలో నిరంతరంగా సెర్చ్ ఆపరేషన్ లు కొనసాగుతున్నాయి.
షోపియాన్ ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం
బుద్గాం జిల్లాలో కొనసాగుతున్న ఎన్కౌంటర్ .. ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతం
ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం అయినట్లుగా అధికారికంగా వెల్లడించారు. కార్ర్ ఈ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో సోమవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈరోజు ఉదయం ఉగ్రవాదుల నుండి అనూహ్యంగా కాల్పులు మొదలు కావడంతో, భద్రతాదళాలు సైతం ఎదురు దాడికి దిగాయి. దీంతో ఒక ఉగ్రవాది మృతి చెందాడని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంకా అక్కడ ఎంత మంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న దానిపై పూర్తి సమాచారం లేదు.
సెర్చ్ ఆపరేషన్ లతో , ఎన్ కౌంటర్ లతో భయం గుప్పిట్లో జమ్మూకాశ్మీర్
ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రత దళాలు, కాశ్మీర్ జోన్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బుద్గాం జిల్లాలో ప్రజలు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ లు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో షోపియన్ జిల్లా కిలూరా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో జరిగిన ఎన్కౌంటర్ లోనలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు . జమ్మూ కాశ్మీర్లోని షోపియన్, పాంపూర్ ల ప్రాంతాల్లో చాలా సార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి .
అనంత నాగ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ పోస్ట్ పై గ్రనేడ్ దాడి చేసిన ఉగ్ర మూక
మరోపక్క అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహారా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ పోస్టుపై అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్ తో ఉగ్రవాదులు దాడి జరిపారు. దక్షిణ కాశ్మీర్లోని బిజ్బెహారా పట్టణానికి, అర్విని గ్రామానికి మధ్య ఉన్న బిజ్బెహర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేశారు.ఈ సంఘటన సోమవారం రాత్రి 8:15 నిమిషాలకు జరిగింది. బిజ్ బెహరా చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి ఈ సంఘటనను ధృవీకరించారు. గ్రనేడ్ తో దాడికి యత్నించిన దానివల్ల ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు అని అధికారి తెలిపారు.
Recommended Video
ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు
పేలుడు శబ్దం విన్న వెంటనే భద్రతా బృందం అక్కడికి వెళ్లిందని, దాడి చేసిన వారిని పట్టుకోవడానికి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని వారు చెబుతున్నారు. నిన్న ఉదయం శ్రీనగర్ నగరం ప్రాంతంలో కూడా సిఆర్పిఎఫ్ కు చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీపై దాడి జరిగిందని అక్కడ కూడా ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు. ఒకపక్కన ఎన్ కౌంటర్ లతో, మరో పక్కన ఉగ్రవాదుల దాడి యత్నాలతో జమ్మూ కాశ్మీర్ అట్టుడికిపోతోంది. భద్రతా బలగాలు, కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నా చాపకింద నీరులాగా ఉన్న ఉగ్ర మూక ఏ మాత్రం అవకాశం దొరికినా దాడులకు తెగబడుతూనే ఉంది.