సరిహద్దుల్లో యుద్దమేఘాలు..! భారీగా సైన్యాన్ని మొహరిస్తున్న భారత్..!!
హైదరాబాద్ : పుల్వామా ఉగ్రఘటన తర్వాత పాకిస్తాన్ పలు కోణాల్లో భారత్ ను కవ్విస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలతో పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ నేతలు కూడా భారత్ పట్ల విషాన్ని చిమ్ముతున్నారు. యుద్దం లో గెలిచేందుకు ఒకటి కాదు యాభై బాంబులు ఏకకాలంలో ప్రయోగించాలంటూ పాకిస్తాన్ కు సలహాలిస్తూ విద్వేషాలను మరింత రెచ్చగొడుతున్నారు. దీంతో అప్రమత్తమైన భారత్ పాక్ సరిహద్దుల్లో పెద్ద యెత్తున సైన్యాన్ని మొహరింపజేస్తోంది. దీంతో సరిహద్దుల్లో యుద్ద వాతావరణం అలుముకుంది.
సరిహద్దులో మొహరిస్తున్న సైన్యం..! అలుముకుంటున్న యుద్ద మేఘాలు..!!
భారత్ సరిహద్దుల్లో భారీఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. వారం పదిరోజులకు సరిపడినంత మందుగుండు సామాగ్రి, యుద్ధట్యాంకులను కూడా తరలిస్తోంది. భారత్ వైపు నుంచి ఇప్పటికే పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నారు. సుమారు 100 కంపెనీల సైనికులు ఇప్పటికే కాశ్మీర్ చేరుకున్నారు. మరో 100 కంపెనీలు ఏ క్షణంలో అయినా విధుల్లోకి వచ్చేందుకు వీలుగా సిద్ధం చేశారు. వారిని వీలైనంత త్వరగా ఇక్కడకు చేర్చేందుకు వాయుమార్గంలో అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు.
అజ్ఞాతంలో ఉన్న ముషార్రఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..! పాక్ మరింత కవ్వింపు..!!
సుమారు 40 గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్నిచోట్ల బంకర్లను తవ్వారు. క్షిపణులు ప్రయోగించినపుడు ఎలా ఉండాలి. ఏ విధంగా దాడుల నుంచి బయటపడాలనే అంశాలపై గ్రామాల్లో సైన్యం అవగాహన కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ మాజీ సైన్యాధికారి జనరల్ ముష్రాప్ తాజాగా ఇరుదేశాల యుద్దం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుంచి దాడి జరిగితే కోలుకోవటం పాక్కు కష్టం అన్నాడు. పాక్ ఒక్క అణుబాంబు ప్రయోగించినా భారత్ నుంచి వచ్చే సమాధానం పాక్ను కోలుకోలేని దెబ్బ తీస్తుందన్నారు. దీన్నుంచి బయటపడాలంటే పాకిస్తాన్ భారత్పై ఏకకాలంలో 50 అణుబాంబులు ప్రయోగించాలంటూ సూచన కూడా చేశాడు.
చైనా పై ఆశలు పెట్టుకున్న పాక్..! సునిశితంగా గమనిస్తున్న భారత్..!!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత్ ఏదో చేస్తోందంటూ ఆందోళన వెలిబుచ్చాడు. ఇజ్రాయేల్, రష్యాలు భారత్లో జరుగుతున్న పరిణామాలు తాము అందించాల్సిన సాయంపై కీలక నిర్ణయం తీసుకున్నాయట. ఇప్పటికే వాణిజ్య యుద్ధం, జల నిర్బంధంతో కకావికలమైన పాకిస్తాన్, చైనావైపు సాయం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. చైనాకు అందివచ్చిన అవకాశం కావటంతో భారత్పై టిబెట్ను సాకుగా చూపుతూ దాడికి దిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్తో ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వస్తే భారత్ ఎలా స్పందించాలనే దానిపై త్రివిద దళాలు సన్నద్ధతను పరిశీలించుకుంటున్నట్టు సమాచారం.
35ఏ ఆర్టికిల్ పై సుప్రీం తీర్పు ప్రభావం..! కశ్మీర్ పై కన్నేసిన పాక్..!!
ఏదేమైనా పాక్-భారత్ మధ్య పూర్తిస్థాయి యుద్ధమంటూ వస్తే, అది అణు యుద్ధంగా మారేందుకు కేవలం రెండ్రోజుల సమయం మాత్రమేనంటూ రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ యుద్ధం సంగతి పక్కనబెడితే, కాశ్మీర్పై 35ఏ ఆర్టికల్పై సుప్రీంకోర్టు ప్రకటించబోయే నిర్ణయం కూడా కాశ్మీర్ను అగ్నిజ్వాలగా మార్చుతుందనే ఆందోళన లేకపోలేదు. దీన్ని అవకాశంగా చేసుకుని పాక్ పరోక్షంగా కాశ్మీర్కు ఆయుధాలు, సైన్య సాయం అందించే అవకాశాలున్నాయి. ఎటువైపు నుంచి చూసినా, సరిహద్దులో యుద్ద వాతారణం మాత్రం కొనసాగుతూనే ఉంది.