వారణాసిలో వార్ వన్ సైడ్ కాదు..! ప్రియాంక ఎంట్రీతో మారిన పాలి'ట్రిక్స్' ..!!
Recommended Video
వారణాసి/హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు మరో సారి వార్తల్లో నిలుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అత్యంత జనసమ్మోహక శక్తి కలిగిన నాయకురాలు ప్రియాంక గాంధీ. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్రమోడీ. వీరిద్దరూ ముఖాముఖి తలపడితే దేశంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పాత తరానికి, యువతరానికి మధ్య పోటీగా కాకుండా బీజేపీ, కాంగ్రెస్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైనట్లు సంకేతాలు పంపినట్లవుతుంది. ఈ ఉత్కంఠ భరిత సన్నివేశానికి వారణాసి వేదిక కాబోతుందా..? అంటే అందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని కాంగ్రెస్ వర్గాలు బదులిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపోటముల కంటే బహుముఖ ప్రయోజనాలు దాగి ఉండటమే కారణం.
వారెవ్వా.. వారణాసి..! దేశ ప్రజల ద్రుష్టిని ఆకర్శిస్తున్న ఎన్నిక..!!
ఒకవైపు స్మృతి ఇరాని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సవాల్ విసురుతున్నారు. ఎటుతిరిగి ఎటు వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా రాహుల్ దక్షిణాదిన వాయనాడ్ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రచారానికి చెక్ పెట్టడంతోపాటు మీ ప్రధానిపైనే పోటీ చేస్తున్నాం కాసుకో అంటూ ప్రతిసవాల్ విసరడమే లక్ష్యంగా ప్రియాంక బరిలోకి దిగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యూపీఏలో ఇప్పటికి మిగిలిన కొన్ని పక్షాలు తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలేవీ కాంగ్రెసుతో కరచాలనం చేసేందుకు సిద్ధంగా లేవు. దీనికి ప్రధాన కారణం హస్తం పార్టీ అధికారంలోకి రాదనే అనుమానమే. ఆ బలహీనతను అధిగమించేందుకూ ప్రియాంక పోటీ ఉపకరిస్తుంది.
కాంగ్రెస్ పుంజుకోవాలంటే ప్రియాంక ఎంట్రీ తప్పని సరి..! వ్యూహాత్మకంగా అడుగులు వేసిన కాంగ్రెస్..!!
ప్రియాంకను నిజంగా రంగంలోకి దింపుతున్నారా..? అవి కేవలం వదంతులేనా..? అన్న అనుమానాలూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో సాగుతున్న చర్చలు, ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణం అవసరమైన ప్రాతిపదికను కల్పిస్తున్నాయి. అయితే అధికారానికి ముఖ ద్వారంగా భావించే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకోవడానికి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. సమాజ్ వాదీ, బహుజన సమాజ్, రాష్ట్రీయలోక్ దళ్ కూటమి హస్తం పార్టీని దూరంగా పెట్టేశాయి. దీనికి బదులు చెబుతూ ఉత్తరప్రదేశ్ లో బలమైన సమీకరణ జరపాలంటే ప్రియాంక రంగంలోకి దిగడమే శరణ్యమనే డిమాండ్ బలంగా ఉంది.
ప్రియాంక ఎంట్రీతో మారిన పరిణామాలు..! నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న రాజకీయం..!!
అందుకే ఆమెకు తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు కొడితే ఏనుగు కుంభస్థలాన్నే ఢీ కొట్టాలని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ పార్టీ మొత్తం ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు సోనియా వారసురాలి పోటీ దోహదం చేస్తుంది. పోటాపోటీ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా బీజేపీని రాష్ట్రంలోని మిగిలిన చోట్ల బలహీనపరచవచ్చు. ఒకవైపు బీజేపీ ప్రాబల్యం పెరగడంతో తమ అస్తిత్వం ప్రమాదంలో పడుతోంది. అయినప్పటికీ కాంగ్రెస్ తో చేరువగా ప్రవర్తిస్తే కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోననే భయం కొన్ని పార్టీలను వెన్నాడుతోంది. దాంతో సాధ్యమైనంత దూరం మెయింటెయిన్ చేస్తున్నారు కొన్నిపార్టీలు.
ప్రియాంక రాకతో కాంగ్రెస్ లో నయా జోష్..! గెలిచి తీరుతామంటున్న పార్టీ శ్రేణులు..!!
మోడీని కాంగ్రెస్ దీటుగా ఎదుర్కోగలదన్న నమ్మకం కలిగిస్తే కొన్ని ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీ వెనక చేరతాయి. ఒకనాడు పాన్ ఇండియా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని కమలం పార్టీ ఆక్రమించింది. తిరిగి తన వైభవాన్ని పునరుద్ధరించుకోవాలంటే కాంగ్రెస్ నుంచి ఒక సంచలనాత్మక నిర్ణయం వెలువడాలి. గెలుస్తామనే నమ్మకం కంటే దేశవ్యాప్తంగా వచ్చే పబ్లిసిటీ, మోడీకి చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ఈ తరహా యోచన చేస్తోంది. ఒకవేళ ప్రియాంక బరిలోకి దిగితే ఈ పోటీ పోల్ ఆఫ్ పోల్స్ గా రూపు సంతరించుకుంటుంది.