జైట్లీ దేశద్రోహం వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధం
సైనిక దళాల ప్రత్యేక అధాకారాల చట్టం.. ఏఎఫ్ఎస్పీఏపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మంగళవారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ చట్టాన్ని సవరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నిర్ణయాన్ని దేశద్రోహంతో పోల్చారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అరుణాచల్ ప్రదేశ్లో మూడు జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను పాక్షికంగా ఉపసంహరిస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది.
కాంగ్రెస్ మానిఫెస్టో అత్యంత భయానకం..! ప్రమాదకర వాగ్దానాలను పొందుపరిచారన్న జైట్లీ..!!
32ఏండ్ల తర్వాత పాక్షికంగా ఎత్తివేత
అరుణాచల్ ప్రదేశ్లో 32ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును పాక్షికంగా ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అరుణాచల్లోని తొమ్మిది జిల్లాల్లో మూడు జిల్లాల పరిధిలో ఏఎఫ్ఎస్పీఏను పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు అందులో స్పష్టంచేసింది. మిగతా ఆరు జిల్లాల్లో శాంతిభద్రతల స్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్
కేంద్ర ప్రభుత్వం అరుణాచల్లోని మూడు జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను పాక్షికంగా ఎత్తివేయడంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. సైనిక దళాల ప్రత్యేక చట్టంలో సవరణలు చేస్తామన్న కాంగ్రెస్ను తప్పుబట్టిన బీజేపీ గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఫైర్ అయింది. చట్ట సవరణ చేయడాన్ని దేశద్రోహంగా అభివర్ణించిన మోడీ సర్కారు.. ఇప్పుడు మూడు జిల్లాల్లో ఎందుకు పాక్షికంగా ఎత్తివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు. 2015లో త్రిపురలో ఏఎఫ్ఎస్పీఏను పూర్తిగా ఎందుకు ఎత్తివేశారో చెప్పాలని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
మోడీ సభ కోసమే నిర్ణయం
రాజకీయ లబ్ది కోసమే మోడీ సర్కారు ఏఎఫ్ఎస్పీఏను పాక్షికంగా ఎత్తివేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అరుణాచల్లో బుధవారం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.