రోడ్డునపడ్డ సిబిఐ పరువు...తమ ఆఫీసులోనే సోదాలు:అందరి అవినీతి బైటపెట్టాల్సిన తానే...!
న్యూఢిల్లీ:కారణాలు ఏమైనా దేశంలో అక్రమార్కుల భరతం పట్టాల్సిన సిబిఐ తానే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. అచ్చగా అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అనే తెలుగు సామెత ప్రస్తుతం సిబిఐ పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. అవినీతిపరులపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాల్సిన సిబిఐ ఇప్పుడు అదే పని తమ అధికారులపైనే చేసింది.
ఏకంగా సంస్థలో నంబర్ 2 పైనే కేసు పెట్టిన సిబిఐ...ఆ తరువాత తమ శాఖ డీఎస్పీనే అరెస్టు చేసింది. అక్రమార్కుల ఇళ్లపై దాడులు చేయాల్సిన సీబీఐ తన ప్రధాన కార్యాలయంలో తానే సోదాలు చేసుకుంది. ఇంతకాలం 'ప్రభుత్వం చేతిలో పావు' అని ముద్ర పడ్డ సీబీఐ...ఇప్పుడు అంతకంటే అప్రతిష్టను మూటకట్టుకుంటూ లంచగొండి ఆఫీసుగా ముద్ర వేసుకుంటోంది. అంతేకాదు మరో రెండు దేశ అత్యున్నత సంస్థలు రా,ఈడీలను కూడా లంచాల ఊబిలోకి లాగినట్లు తెలుస్తోంది.
కేంద్రం నుంచి నిధులు ఎలా తేవాలో తెలుసు, నవ్వుతున్నారా: బాబు, టిట్లీపై పవన్ కళ్యాణ్
సిబిఐ పరిణామాలు...పెను ప్రకంపనలు
దేశ అత్యన్నత విచారణ సంస్థల్లో ఒకటైన సీబీఐలో ఉన్నతాధికారుల లంచాల భాగోతం మరిన్ని సంచలనాలకు దారితీస్తోంది. సిబిఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాపై కేసు నమోదే తీవ్ర దుమారం రేపగా...సోమవారం ఏకంగా సిబిఐ తమ డిఎస్పీ దేవేందర్ కుమార్ నే అరెస్ట్ చేయడం మరిన్ని ప్రకంపనలు రేపింది.పైగా ఈ డిఎస్పీ దేవేందర్ లంచం కేసు ఎదుర్కొంటున్న స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా కింద పనిచేస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి కావడం..ఆయనకు సహకరించే క్రమంలోనే ఈయన కేసులో ఇరుక్కొన్నారనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.
అంతర్గత పోరుతో...అన్నీ వెలుగులోకి
అసలు ఈ రగడకు కారణమైన మనీ ల్యాండరింగ్ కేసులో అత్యంత కీలకంగా మారింది హైదరాబాద్ కు చెందిన వ్యాపారి సానా సతీశ్బాబు కాగా...ఈయన వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలతోనే సిబిఐ డిఎస్పీ దేవేందర్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అరెస్టయిన తొలి సిబిఐ అధికారి దేవేందర్ కుమారే కావడం గమనార్హం. అయితే ఈ అవినీతి వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తోంది సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకూ...స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు మధ్య సాగుతున్న అంతర్గత పోరు కారణంగానే అనేది అందరికీ తెలిసిన విషయమే.
మరిన్ని అరెస్టులు...ఖాయం అంటున్నారు
ఇదే క్రమంలో ఈ వ్యవహారం మరింత ముదిరి మరిన్ని అరెస్టులకు దారితీయడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో సిబిఐ సైతం యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్పెషల్ డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కాగా స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా విషయంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం గమనార్హం. అంతేకాదు అలోక్ ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తు కోసం సీబీఐ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగడం...డీఎస్పీ హోదాలో ఉన్న దేవేందర్ ను నిబంధనలకు విరుద్దంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోమవారం మధ్యాహ్నం కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేయడం చర్చనీయాంశం అయ్యాయి.
ఆధిపత్య పోరే...సిబిఐ కొంప ముంచింది
అయితే ముందు ముందు సిబిఐ వ్యవహారం మరిన్ని సంచలనాలతో దేశాన్ని కుదిపేయడం ఖాయమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీబీఐలో టాప్ టు పొజిషన్స్ లో ఉన్న అలోక్ వర్మ, అస్థానా ల మధ్య దాదాపు రెండేళ్ల నుంచి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అలోక్ వర్మపై కొంతకాలంగా స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా పదే పదే ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. అనేక కేసుల్లో అలోక్వర్మ జోక్యం ఎక్కువయ్యిందని, కొన్నింటిలో దర్యాప్తు నిలిపేయాలని ఆదేశిస్తున్నారని అంటూ అలోక్పై కేబినెట్ కార్యదర్శికి రెండు నెలల కిందటే ఓ ఫిర్యాదు పంపారు. అంతేకాదు తననే అవినీతి కేసులో ఇరికించేందుకు తన సొంత బృందమే ప్రయత్నిస్తుందని తెలిసిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తాను వేగంగా పావులు కదిపి శత్రువునే దెబ్బతీశారని, ఆ క్రమంలో ఈ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆస్థానా పై వేటు...తప్పదా?
లంచం ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అస్థానాపై తదుపరి చర్యలకు ప్రధాని మోడీ విముఖంగా ఉన్నట్లు తొలుత ప్రచారం జరుగగా...తదనంతర పరిస్థితుల నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిశీలించారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అస్థానాను అదే పదవిలో కొనసాగనిస్తే అది రాజకీయంగా తనకు గుదిబండగా మారే ప్రమాదముందని మోడీ, బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆస్థానాను సస్పెండ్ చేయడమో...లేదా ట్రాన్స్ ఫర్ చేయడమో చేయాలనే ఆలోచనలో మోడీ ఉన్నట్లుగా సమాచారం. తానే ఏరి కోరి తెచ్చుకున్న ఆస్థానా లంచాల భాగోతంలో చిక్కుకొని చివరకు తమ ప్రభుత్వం ప్రతిష్ట ఘోరంగా దెబ్బతినేలా చేయడంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి చెందారని, ఏదేమైనా ఆయనకు స్థానచలనం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.